
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన మనుషులను చంపుతూనే ఉంటారంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. యుద్ధం ఏమాత్రం మంచిది కాదంటూ ట్రంప్ హితవు పలికారు. మరోవైపు, రష్యాపై మరిన్ని ఆంక్షలు ఉండొచ్చంటూ ట్రంప్ బెదిరింపులకు దిగారు. ఇటీవల ట్రంప్-పుతిన్లు ఫోన్ కాల్లో మాట్లాడుకున్న సంగతి తెలిసిందే.
అయితే, ఉక్రెయిన్తో యుద్ధ విరమణ విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. యుద్ధం ఆపుతాడని అనుకోవడం లేదంటూ పుతిన్తో ఫోన్ సంభాషణ అనంతరం వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్పై రష్యాతో యుద్ధ విరమణ చేయించడానికి ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాగా, ఉక్రెయిన్ రాజధాని కీవ్ లక్ష్యంగా రష్యా మరోసారి భీకర దాడులకు తెరతీసిన సంగతి తెలిసిందే.
గురువారం రాత్రి కేవలం 7 గంటల వ్యవధిలో 550 వరకు డ్రోన్లు, 11 క్షిపణులను ప్రయోగించింది. రష్యా మూడేళ్ల క్రితం ఉక్రెయిన్పై దురాక్రమణ ప్రారంభించాక చేపట్టిన అతిపెద్ద దాడి ఇదేనని చెబుతున్నారు. షహీద్ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణుల పేలుళ్ల మోతలతో కీవ్ దద్దరిల్లింది. సైరన్లు రాత్రంగా మోగుతూనే ఉన్నాయి. ‘మా ప్రజలు కఠినమైన, నిద్ర లేని రాత్రి గడిపారు’ అని అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు.
ప్రజలు మెట్రో స్టేషన్లు, బేస్మెంట్లు, భూగర్భ పార్కింగ్ గ్యారేజీల్లోకి పరుగులు తీశారని ఉక్రెయిన్ మంత్రి యూలియా తెలిపారు. కీవ్తోపాటు మరో ఐదు ప్రాంతాలపైకి రష్యా దాడులు చేసిందని జెలెన్స్కీ చెప్పారు. తాము 270 డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో సంభాషణ జరిపిన రోజే తాజా దాడి జరగడం గమనార్హం.