పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా-ఇరాన్ మధ్య సయోధ్య కుదిర్చే యత్నం చేస్తున్నామని పాకిస్థాన్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇరాన్ దీనిపై స్పందించింది. ఇస్లామాబాద్లో పాక్ నిర్వహించిన ఏ సమావేశంలోనూ పాల్గొనలేదని భారత్లోని ఇరాన్ రాయబారి స్పష్టం చేశారు.
పాకిస్థాన్ ఉప ప్రధాని ఇటీవల ఇస్లామాబాద్లో సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ విదేశాంగ మంత్రులతో సమావేశమయ్యారు. అమెరికా, ఇరాన్ చర్చలకు ఇస్లామాబాద్ ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఇరాన్ అధ్యక్షుడితో కూడా తాము మాట్లాడామని ఆయన ప్రకటించారు. అయితే, ఈ ప్రకటనను ఇరాన్ పూర్తిగా ఖండించింది.
ఈ మేరకు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికాతో తాము నేరుగా ఎటువంటి చర్చలు జరపడం లేదని మధ్యవర్తుల ద్వారా అమెరికా కేవలం అహేతుకమైన మితిమీరిన డిమాండ్లను మాత్రమే పంపుతోందని తెలిపారు.
అమెరికా దౌత్య విధానం తరచుగా మారుతూ ఉంటుందని కానీ ఇరాన్ మాత్రం మెుదటి నుంచి ఒకే మాటపై ఉందన్నారు. అదే విధంగా పాకిస్థాన్ వారి సొంతంగా సమావేశం నిర్వహించిందని అందులో తాము పాల్గొనలేదని తెలిపారు. యుద్దం ముగింపుకు వారి ప్రయత్నం అభినందనీయమని అదే సమయంలో యుద్ధం ఎవరు మెుదలుపెట్టారో గుర్తుంచుకోవాలని ఈ సందర్బంగా ఇరాన్ రాయబారి అన్నారు.


