
అమెరికా దంపతులకు రూ.12.86 కోట్ల లాటరీ
వాషింగ్టన్: అదృష్టం అంటే నిజంగా ఇదేనేమో! డిన్నర్ చేద్దామని సరదాగా హోటల్కు వెళ్తూ మధ్యలో ఆగి కొన్న లాటరీ టికెట్కు ఏకంగా 1.5 మిలియన్ డాలర్ల(రూ.12.86 కోట్లు) సొమ్ము లభించింది. అమెరికాలోనూ న్యూజెర్సీలో ఈ సంఘటన జరిగింది. న్యూజెర్సీ దంపతులు డిన్నర్ కోసం హోటల్కు బయలుదేరారు. మధ్యలో ఓ దుకాణం వద్ద ఆగి 3 డాలర్లు(రూ.257) పెట్టి లాటరీ టికెట్ కొనేశారు. నిజానికి వారిద్దరిలో ఒకరికి ఇదే దుకాణంలో కొనడం ఇష్టంలేదు. మరోచోట చూద్దామని చెప్పారు. కాసేపు ఇద్దరూ చర్చించుకొని చివరికి ఇక్కడే కొనాలని నిర్ణయించుకున్నారు.
టికెట్ కొన్న తర్వాత స్క్రాచ్ చేసి చూడగా, ఏకంగా 1.5 మిలియన్ డాలర్ల సొమ్ము గెలుచుకున్నట్లు తెలిసిపోయింది. దంపతులు ఒక్కసారిగా కోటీశ్వరులుగా మారిపోయారు. తమ కష్టాలన్నీ తీరిపోయినట్లేనని వారు ఆనందం వ్యక్తంచేశారు. బిల్లులు చెల్లించడానికి ఇన్నాళ్లూ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇకపై ఆ పరిస్థితి ఉండదని చెప్పారు. తమ జీవితం ఇక సుఖమయం అవుతుందని సంతోషపడ్డారు. 1.5 మిలియన్ డాలర్ల సొమ్మును 25 ఏళ్లపాటు విడతలవారీగా తీసుకొనేలా లాటరీ నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకున్నారు.