హవానా: అమెరికా ప్రభుత్వంతో తాము చర్చలు జరిపినట్లు వస్తున్న వార్తలను కమ్యూనిస్ట్ దేశం క్యూబా అధ్యక్షుడు మిగెల్ డయాజ్ కనెల్ ధ్రువీకరించారు. రెండు దేశాల మధ్య ఉన్న విభేదాలకు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలన్నదే ఈ సంభాషణల లక్ష్యమని చెప్పారు. అంతర్జాతీయ పరిణామాలు ఇందుకు అవకాశమిచ్చాయన్నారు.
చర్చల వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ఈ అంశంపై నిరాకరించేందుకు అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ నిరాకరించింది. అమెరికా ఇంధన దిగ్బంధం కారణంగానే గత మూడు నెలలుగా తమకు పెట్రోలియం ఉత్పత్తులు అందడం లేదని అధ్యక్షుడు డయాజ్ కనెల్ అన్నారు. సహజ వాయువు, సోలార్ పవర్ థర్మోఎలక్ట్రిక్ ప్లాంట్లతో నెట్టుకొస్తున్నామన్నారు.
తీవ్ర ఇంధన కొరత ప్రభావం సమాచార, విద్య, రవాణా రంగాలపై ఎక్కువగా పడిందని, ఆస్పత్రుల్లో వేలాదిమందికి అవసరమైన శస్త్ర చికిత్సలు వాయిదాపడ్డాయని చెప్పారు. దేశంలో ఉన్న 115 బేకరీలు ప్రస్తుతం బొగ్గు, వంటచెరుకుతోనే నడుస్తున్నాయన్నారు. క్యూబాకు ప్రధాన చమురు సరఫరాదారు వెనెజువెలా. అయితే, రెండు నెలల క్రితం వెనెజువెలాపై అమెరికా దాడి చేసి అధ్యక్షుడిని బంధించి తీసుకెళ్లడంతో క్యూబాకు చమురు రవాణా ఆగిపోయింది. అమెరికా ఆంక్షల కారణంగా ఇతర దేశాల నుంచి అవసరమైన యంత్రాలు, ఇతర విడి భాగాలను క్యూబా కొనుగోలు చేయలేకపోతోంది.


