Brazil De Jesus Santos Murder: పోలీసుల కర్కశత్వం...మోకాళ్లతో తొక్కిపెట్టి హింసించి, ఊపిరాడకుండా చేసి...
Asphyxiation death of Black man: బ్రెజిల్లో జ్యాత్యాహంకారం కోరలు చాచింది. అక్కడి పోలీసులు.. ఒక నల్లజాతీయుడిని దారుణంగా హింసించడంతో పాటు ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దేశమంతటా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి.
సెర్గిప్లోని యుంబౌబలో హైవేపై మోటర్ సైకిల్ మీద వెళ్తున్న డి జీసస్ శాంటోస్ అనే వ్యక్తిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత అతని నేలపై కూర్చొబెట్టి మోకాళ్లతో తొక్కిపెట్టి హింసించారు. అంతటితో ఆపకుండా కారు డిక్కిలో పడేసి బాష్పవాయువు ప్రయోగించారు. దీంతో శాంటోస్ కన్నుమూశాడు. అయితే పోలీసులు మాత్రం శాంటోస్ దురుసుగాగా ప్రవర్తించాడని, అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తే ప్రతిఘటించాడని చెబుతున్నారు. అతనిని నియంత్రించే క్రమంలోనే బాష్పవాయువును ఉపయోగించామని చెప్పారు.
కానీ బాధిత కుటుంబం మాత్రం శాంటోస్ని హైవేపై బలవంతంగా ఆపి చొక్కా పైకెత్తమనడంతో.. భయపడ్డాడని అంటున్నారు. పైగా మానసికంగా అతను స్థిమితంగా లేడని, అతని దగ్గర మందుల చీటి చూసి కూడా కనికరించకుండా హింసించారని అంటున్నారు. శాంటోస్ ఎంతగా వదిలేయమని ప్రాధేయపడ్డా వదలకుండా ఊపిరాడకుండా చేసి చంపేశారంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
శాంటోస్ని పోలీస్స్టేషన్కి తరలించే క్రమంలోనే తీవ్ర ఆవస్థతకు గురై చనిపోయాడని పోలీసులు అంటున్నారు. ఊపిరాడకపోవం వల్లే మృతిచెందినట్లు పోస్ట్మార్టం నివేదిక చెబుతోంది. దీంతో.. శాంటోస్ హత్యకు పోలీసులే కారణమంటూ.. జనాలు రోడ్ల పైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ఈ ఘటన కార్చిచ్చు రాజేయడంతో.. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఉన్నత దర్యాప్తునకు ఆదేశించారు.
(చదవండి: మిస్టర్ బైడెన్.. ముందు అమెరికన్లను కాపాడండి: ట్రంప్ ఫైర్)