రంగంలోకి బ్యాంకులు : చిక్కుల్లో అంబానీ | Bank of China launches enforcement action on Anil Ambani worldwide assets | Sakshi
Sakshi News home page

రంగంలోకి బ్యాంకులు : చిక్కుల్లో అంబానీ

Sep 28 2020 8:49 AM | Updated on Sep 28 2020 4:42 PM

Bank of China launches enforcement action on Anil Ambani worldwide assets - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  అప్పుల సంక్షోభంలో కూరుకుపోయిన పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి మరోఎదురు దెబ్బ  తగిలింది. 717 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.5,354 కోట్లు) విలువైన బాకీలపై మూడు చైనా బ్యాంకుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చైనా బ్యాంకులు ఇప్పుడు అనిల్ అంబానీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తులను వివరాలను అంచనా వేసేందుకు సిద్ధపడుతున్నాయి. లండన్ కోర్టు ఉత్తర్వుల మేరకు బకాయిల వసూలుకు రంగంలోకి దిగాయి. తమకు రావాల్సిన రుణ బకాయిలకోసం అందుబాటులో ఉన్న  చట్టపరమైన అన్నిమార్గాలను ఉపయోగించుకుంటామని ప్రకటించాయి.  అయితే ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంబానీపై వ్యక్తిగత దివాలా చర్యలకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో చైనా బ్యాంకుల చర్యలకు అడ్డంకులు తప్పవని భావిస్తున్నారు. (కోర్టు ఫీజుల కోసం నగలు అమ్ముకున్నా: అంబానీ)

అనిల్‌ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) అంబానీ పర్సనల్ గ్యారంటీతో, చైనాకు చెందిన మూడు బ్యాంకుల నుంచి 2012లో 925 మిలియన్‌ డాలర్ల  రుణం తీసుకుంది. కానీ దివాలాతీసిన ఆర్‌కామ్‌ ఈ రుణాన్ని పూర్తిగా చెల్లించడంలో విఫలమైంది. దీంతో  ఈ బకాయిల వసూలు కోసం కోర్టును ఆశ్రయించగా,  చైనా బ్యాంకులకు రూ .5,226 కోట్లు చెల్లించాలని మే 22 న కోర్టు అనిల్ అంబానీని ఆదేశించింది.  జూన్ 29 నాటికి, అంబానీ చెల్లించాల్సిన అప్పు 717.67 మిలియన్ డాలర్లకు పెరిగింది. అయితే తన దగ్గర చిల్లిగవ్వలేదనీ,   బాకీ చెల్లించే స్తోమత లేదని అంబానీ వాదిస్తున్నారు. కోర్టు ఫీజుల కోసం తనభార్య నగలు అమ్మి,  అతి సాధారణ జీవితాన్ని గడుపుతున్నానంటూ తాజాగా వాదించిన సంగతి తెలిసిందే.  అయితే అంబానీ వాదనతో విబేధిస్తున్న బ్యాంకులు అప్పులు కట్టాల్సిందేనని స్పష్టం చేశాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement