
ముంబైలోనూ లోకేంద్ర గ్యాంగ్ పంజా
వాచ్మెన్ పేరుతో సిమ్కార్డు తీసుకుని...
హేమ్రాజ్ ఇంట్లో చోరీ చేయడానికి నగరానికి వచ్చిన లోకేంద్ర గ్యాంగ్ సైదాబాద్ ప్రాంతంలో షెల్టర్ తీసుకుంది. తన ఖాళీ స్థలంలో కొన్ని గదులు నిర్మించిన దాని యజమాని వాచ్మెన్ ఆధీనంలో ఉంచారు. ఆ వాచ్మెన్ ద్వారానే ఓ గదిని అద్దెకు తీసుకున్న ఈ గ్యాంగ్ షెల్టర్ ఏర్పాటు చేసుకుంది. ఈ నేపథ్యంలో వీరికి సంబంధించిన ఎలాంటి గుర్తింపు పత్రాలు వారి వద్దా అందుబాటులో లేవు. నేరం చేయడానికి ముందు వినియోగించడానికి ఓ సెకండ్ హ్యాండ్ ఫోన్ను నగరంలోనే ఖరీదు చేసిన లోకేంద్ర.. ఆ స్థలం వాచ్మెన్ పేరుతో సిమ్కార్డు తీసుకున్నాడని పోలీసులు గుర్తించారు. కాచిగూడలో నేరం తర్వాత హేమ్రాజ్ కారులో సంతోష్నగర్ వరకు వెళ్లిన ఈ ముఠా ఆ వాహనం అక్కడ వదిలేసింది. అక్కడ నుంచి ట్యాక్సీలో షోలాపూర్కు... అట్నుంచి మరో ట్యాక్సీలో పుణేకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ నుంచి ఎటు వెళ్లారనేది ఆరా తీస్తున్నారు. ఈ నేరంలో ఐదుగురి పాత్ర ఉన్నట్లు పోలీసులు తొలుత భావించారు. అయితే నేరుగా పాల్గొన్న నలుగురితో పాటు మరికొందరి పాత్ర ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. వీరిలో బిమ్లతో సహా నలుగురిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించట్లేదు.
సాక్షి, సిటీబ్యూరో:
కాచిగూడకు చెందిన కార్టన్స్ ఫ్యాక్టరీ యజమాని హేమ్రాజ్ దుగ్గర్ ఇంట్లో భారీ చోరీ చేసిన నేపాలీ గ్యాంగ్ సూత్రధారి లోకేంద్ర బహదూర్ షాహి నేతృత్వంలోని ముఠా చేసిన మరో నేరం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పంజా విసరడానికి ఆరు నెలల ముందు ముంబైకి చెందిన ఓ బడా వ్యాపారి ఇంట్లో ఇదే పంథాలో 5 కేజీల బంగారం తస్కరించినట్లు వెలుగులోకి వచ్చింది. ఆ నేరంలో లోకేంద్ర పాత్ర ఖరారు చేశామని, మిగిలిన వారి పాత్ర తేలాల్సి ఉందని నగర అధికారులకు మహారాష్ట్ర పోలీసుల తెలిపారు. కాచిగూడ కేసు దర్యాప్తును స్వయంగా పర్యవేక్షిస్తున్న ఈస్ట్జోన్ డీసీపీ డాక్టర్ బి.బాలస్వామి వివిధ రాష్ట్రాల పోలీసులతో పాటు భారత్–నేపాల్ సరిహద్దుల్లో ఉండే బలగాలతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు.
వ్యవస్థీకృతంగా లోకేంద్ర వ్యవహారాలు
కొన్నేళ్ల క్రితం నేపాల్ నుంచి వసలవచ్చిన లోకేంద్ర వ్యవస్థీకృతంగా ఈ చోరీలు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడి వ్యాపారుల ఇళ్లల్లో పని చేస్తున్న నేపాలీల్లో కొందరితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా ఆయా వ్యాపారుల కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు తెలుసుకుంటున్నాడు. అప్పటికే పని చేస్తున్న వారి ద్వారానే, ఆ స్థానంలో మరో నేపాలీని పనిలో పెట్టిస్తున్నాడు. ఆపై అదును చూసుకుని తన ముఠాతో రంగంలోకి దిగి ఆ ఇంటిని కొల్లగొట్టిస్తున్నాడు. ముంబైకి చెందిన వ్యాపారి ఇంట్లో ఇదే పంథాలో ఐదు కేజీల బంగారం తస్కరించారు. ఈ నేరంలోనూ లోకేంద్రతో పాటు కాచిగూడ కేసులో వాంటెడ్గా ఉన్న దీపేందర్, చతుర్భుజ్ పాత్రల్నీ అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు. లోకేంద్ర అరెస్టు తర్వాతే దీనిపై క్లారిటీ కానుండటంతో అతడి కోసం గాలిస్తూ ఓ బృందాన్ని నేపాల్కు పంపారు. నగర పోలీసులకు చెందిన మూడు బృందాలు సైతం ఈ ముఠా కోసం వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్నాయి.
దళారిగా మాట్లాడిందీ దేవేంద్రే అని గుర్తింపు...
ఇక్కడ చోరీ చేసిన సొత్తుతో నేపాల్ వెళ్లిపోయే లోకేంద్ర అక్కడ ఉన్న ఓ వ్యాపారి ద్వారా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు. ఆ మొత్తం నుంచి తన అనుచరులకు, నేరం చేయడానికి సహకరించిన వారిని వాటాలు ఇస్తున్నాడు. అనుచరులకు నేరుగా ఇస్తుండగా... సహకరించిన వారి కుటుంబీకులకు నేపాల్లోనే అందిస్తున్నాడు. ఆపై మరో నేరం చేయడానికి ఇంకో నగరాన్ని ఎంచుకుని లోకేంద్ర గ్యాంగ్ రంగంలోకి దిగుతోంది. ఇలానే హేమ్రాజ్ ఇంట్లో పని చేస్తున్న బిమ్లను సంప్రదించిన లోకేంద్ర ఆమె ద్వారా అర్పితను ఆ ఇంట్లో పనికి పెట్టాడు. మరో పనివాడు కావాలంటూ హేమ్రాజ్ ఆమెను కోరడంతో ఇంద్రన్ బహదూర్ అనే ఏజెంట్తో మాట్లాడించింది. అతడి ద్వారానే దీపేంద్ర హేమ్రాజ్ ఇంట్లో పనికి చేరాడు. ఆపై కేవలం వారం రోజుల్లోనే మిగిలిన వారితో కలిసి ఈ చోరీ చేశాడు. ఈ కేసు దర్యాప్తు నేపథ్యంలో కాచిగూడ పోలీసులు ఇంద్రన్ పేరుతో మాట్లాడింది కూడా దీపేంద్రే అని గుర్తించారు. లోకేంద్ర గ్యాంగ్కు సహకరించిన బిమ్లను పట్టుకున్నారు. ఆమెను అరెస్టు చేసిన రిమాండ్కు తరలించారు.
అక్కడ ఓ బడా వ్యాపారి ఇంట్లో భారీ చోరీ
ఐదు కేజీల బంగారం ఎత్తుకుపోయిన గ్యాంగ్
కాచిగూడలో నేరం చేయడానికి
6 నెలల ముందు..
ఈ కేసులో బిమ్లను అరెస్టు చేసిన నగర పోలీసులు

ముంబైలోనూ లోకేంద్ర గ్యాంగ్ పంజా

ముంబైలోనూ లోకేంద్ర గ్యాంగ్ పంజా