కోకాపేటలో నకిలీ పత్రాలతో రూ.కోట్ల విలువైన భూమికి ఎసరు | - | Sakshi
Sakshi News home page

కోకాపేటలో నకిలీ పత్రాలతో రూ.కోట్ల విలువైన భూమికి ఎసరు

Sep 27 2023 7:42 AM | Updated on Sep 27 2023 8:07 AM

- - Sakshi

మణికొండ: ఓ ప్రైవేటు భూమి ఒకరి పేరుతో రికార్డులలో వస్తుండటం, సదరు వ్యక్తి ఎక్కడ ఉంటున్నాడో తెలియక పోవటంతో దాన్ని కొట్టేసేందుకు ఓ ఫేక్‌ బృందం చేసిన ప్రయత్నం వికటించింది. ఏకంగా రూ.200 కోట్లకు పైగా విలువైన భూమి కావటంతో నకిలీ రాయుళ్లు ఓ బృందంగా ఏర్పడి దాన్ని స్వంతం చేసుకోవాలని పథకం రచించారు. అందుకనుగుణంగా ఆధార్‌ కార్డు, పాన్‌కార్డులను అతని పేరుతో సృష్టించటంతో పాటు అదే సంస్థకు చెందిన పక్క భూమిలోకి వెళ్లిం విధ్వంసం సృష్టించారు. సదరు భూ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన నార్సింగి పోలీసులు ఎట్టకేలకు ఫేక్‌ భూ యజమానిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కోకాపేట రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్‌ 168లో 1995 సంవత్సరంలో ఆశ్రేయ రిసార్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ప్రస్తుత ఓషియన్‌ పార్కు) పేరుతో 15.32 ఎకరాలను కొందరు వ్యక్తులు కొనుగోలు చేశారు. సదరు సంస్థకు అప్పట్లో కోపూరి శ్రీనివాస్‌ గుప్తా ఎండీగా ఉన్నారు. కొనుగోలు చేసిన వ్యక్తుల మధ్య విభేదాలు రావటంతో తర్వాత అతను సంస్థకు దూరంగా ఉన్నాడు. వారు కొనుగోలు చేసిన భూమిలో 4 ఎకరాలు వారి పేరుతో అప్పట్లో మ్యుటేషన్‌ కాలేదు. ఇటీవల ధరణి పోర్టల్‌లో పరిశీలించగా మ్యుటేషన్‌ కాని 4 ఎకరాల భూమి ఆశ్రేయ రిసార్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరు, దాని యజమాని కోపూరి శ్రీనివాస్‌గుప్తాగా నమోదై ఉంది.

అతను సంస్థకు దూరంగా ఉండటం, ఎక్కడ ఉన్నాడో సదరు సంస్థ వారికే తెలియక పోవటాన్ని ఆసరాగా తీసుకుని మాటూరి శ్రీనివాస్‌ కుమార్‌ అనే వ్యక్తి తన ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డులను అతని పేరుతో నకిలీవి తయారు చేసుకుని సదరు భూమిని విక్రయించేందుకు మార్కెట్‌లో పెట్టాడు. అతని బృందంలోని గజ్టెల కాంతం, కోలా శ్రీనివాస్‌, ఈగ రవీందర్‌రెడ్డి, మదన్‌గుప్తా, ఒదేలులకు ఈ సంవత్సరం ఎప్రిల్‌ 18వ తేదీన అగ్రిమెంట్‌ చేశాడు. జూన్‌ 24వ తేదీ ఉదయం అగ్రిమెంట్‌ చేసుకున్న వ్యక్తులు సర్వేనెంబర్‌ 168కి బదులుగా పక్కనే ఉన్న సర్వే నెంబర్‌ 166లోకి అక్రమంగా ప్రవేశించి జేసీబీ, ట్రాక్టర్‌ డోజర్‌లతో గేట్‌, ప్రహరీ, వాచ్‌మెన్‌ గది, లేబర్‌ గదులను కూల్చివేశారు.

విషయం తెలుసుకున్న సదరు సంస్థ భాగస్వామి అరవింద్‌కుమార్‌ అగర్వాల్‌, అతని అనుచరులు అక్కడకు వెళ్లి వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా చంపేస్తామని బెదిరించారు. దీంతో నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అక్కడకు వెళ్లే లోపు వారంతా పారిపోయారు. ముఠాలో ప్రధాన నిందితుడు శ్రీనివాస్‌కుమార్‌ను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement