డమ్మీ పిస్టల్‌తో బెదిరించి దారి దోపిడీ | - | Sakshi
Sakshi News home page

డమ్మీ పిస్టల్‌తో బెదిరించి దారి దోపిడీ

Sep 20 2023 6:02 AM | Updated on Sep 20 2023 7:30 AM

నిందితులు సోహైల్‌, సాజద్‌  - Sakshi

నిందితులు సోహైల్‌, సాజద్‌

 చిలకలగూడ : డమ్మీ పిస్టల్‌తోపాటు చాకులతో మహిళలను బెదిరించి దారి దోపిడీకి పాల్పడిన వ్యక్తులను చిలకలగూడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. చిలకలగూడ ఏసీపీ జయపాల్‌రెడ్డి, సీఐ మట్టంరాజు, డీఐ శ్రీశైలంనాయక్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఖమ్మంజిల్లా, తిరువూరుకు చెందిన వెంకటేశ్వరరావు సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భార్య సుజాత, సోదరుడు మహేష్‌, అతని భార్య శ్రీభాలు రోగికి సహాయం చేసేందుకు వచ్చారు. ఈనెల 17న రాత్రి తన సొంత ఆటోలో మహేష్‌, శ్రీభా, సుజాతలతో కలిసి సికింద్రాబాద్‌ నుంచి గాంధీ ఆస్పత్రికి బయలుదేరాడు. పిల్లర్‌ నంబర్‌ 1015 వద్ద ఆటోను రోడ్డు పక్కన ఆపి మహేష్‌ మూత్ర విసర్జనకు వెళ్లాడు.

అదే సమయంలో కొందరు యువకులు ఆటోను చుట్టుముట్టి పిస్టల్‌, చాకులతో శ్రీభా, సుజాతలను బెదిరించారు. వారివద్ద ఉన్న రూ. 2 వేల నగదు లాక్కున్నారు. వారి మెడలోని గొలుసులు తెంపేందుకు యత్నించగా, బాధితులు గట్టిగా కేకలు వేయడంతో ఆటో వద్దకు చేరుకున్న మహేష్‌ను పక్కకు నెట్టివేసి బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించారు. మంగళవారం ఉదయం నామాలగుండు చౌరస్తావద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా బైక్‌పై అటుగా వచ్చిన నిందితులు పోలీసులను చూసి పరారయ్యేందుకు ప్రయత్నించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు.

ఆటోడ్రైవర్లుగా పని చేస్తూనే..
ముషీరాబాద్‌, వారాసిగూడ, బండ్లగూడలకు చెందిన సోహైల్‌, అప్రోజ్‌, సాజద్‌ ఆటోడ్రైవర్లుగా పని చేస్తున్నారు. జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించేందుకు మరికొందరితో కలిసి దారిదోపిడీలకు పాల్పడేందుకు డమ్మీ పిస్టల్‌, చాకులను సమకూర్చుకుని గాంధీఆస్పత్రి ఎదుట మెట్రోస్టేషన్‌ సమీపంలో మాటువేశారు. రోడ్డు పక్కన నిలిచి ఉన్న ఆటోలో ఉన్న మహిళలను గమనించి బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు.

నిందితులు సోహైల్‌, సాజద్‌లను అరెస్ట్‌ చేసిన పోలీసులు వారి నుంచి డమ్మీ పిస్టల్‌, చాకులు, నగదు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకుని, మంగళవారం రిమాండ్‌కు తరలించారు. పరారీలోఉన్న అప్రోజ్‌తోపాటు మరికొందరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు. రౌడీషీటరైన ప్రధాన నిందితుడు సోహైల్‌పై పలు కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. దారి దోపిడీ కేసును చాకచక్యంగా చేధించిన చిలకలగూడ ఎస్‌ఐ మట్టంరాజు, డీఐ శ్రీశైలంనాయక్‌. క్రైం సిబ్బందిని నార్త్‌జోన్‌ డీసీపీ సునీల్‌దత్‌, ఏసీపీ జయపాల్‌రెడ్డి అభినందించారు.

గాంధీ సెక్యూరిటీ సిబ్బంది ఔదార్యం...
దారిదోపిడీకి గురైన బాధితులకు గాంధీ జీడీఎక్స్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ శివాజీ నేతృత్వంలో అన్నం పెట్టి, వసతి కల్పించారు. ఖమ్మం వెల్లేందుకు అవసరమైన బస్సు చార్జీలను అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు.

స్వాధీనం చేసుకున్న డమ్మీ పిస్టల్‌  1
1/1

స్వాధీనం చేసుకున్న డమ్మీ పిస్టల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement