భారతదేశంలో మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. మన దేశంలో దాదాపు 10 కోట్ల మందికి పైగా మధుమేహం ఉంది. డయాబెటిస్కు భారత్ ప్రపంచ రాజధానిగా మారుతోంది.
గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) అనేది ఆహారంలోని కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయులను ఎంత వేగంగా పెంచుతాయో కొలిచే ప్రమాణం. ఇది ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునేవారికి, హృదయ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునేవారికి చాలా ముఖ్యం.
అలాగే, విటమిన్ B12 లోపం సమస్య కూడా దేశంలో చాలా మందికి ఉంది. దీని వల్ల అలసట, బలహీనత, ఆహారం తినాలనే ఆసక్తి తగ్గడం, బరువు తగ్గడం, నోరు, నాలుకలో గాయాలు లేదా నొప్పి, చర్మం పసుపు లేదా తెల్లగా కనిపించడం, నాడీ సంబంధిత సమస్యలు, చేతులు, కాళ్లలో ముల్లు గుచ్చినట్లు అనిపించడం లేదా నొప్పి, కంటి చూపు సమస్యలు, చికాకు, మూడ్ మార్పులు వంటివి వస్తాయి.
ఈ పై అనారోగ్య సమస్యలన్నింటికీ బియ్యంతో పరిష్కారం దొరికితే ఎలా ఉంటుంది? మనం ప్రతిరోజు తినేది అన్నమే. అదే మన ఆరోగ్యం పాలిట వరంగా మారే రోజులు వచ్చాయి. మధుమేహం, పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి ఉపయోగపడే ‘డిజైనర్ రైస్’ను అభివృద్ధి చేశారు భారతీయ శాస్త్రవేత్తలు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఎస్ఐఆర్, ఎన్ఐఐఎస్టీ డైరెక్టర్ డాక్టర్ సి.ఆనందరామకృష్ణన్ తెలిపారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎన్ఐఐఎస్టీ) సంస్థ 22 శాతం ప్రోటీన్, సుమారు 54 గ్లైసెమిక్ ఇండెక్స్ జీఐ ఉండే డిజైనర్ బియ్యాన్ని అభివృద్ధి చేసింది. అంతేకాదు, ఈ బియ్యంలో ఇనుము (ఐరన్), ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బీ12 కూడా ఉంటుంది.
ఈ బియ్యం మధుమేహంతో బాధపడుతున్న వారికి సాయపడుతుంది. వారికి తక్కువ జీఐ ఉత్పత్తి అవసరమవుతుంది. ఈ బియ్యం దాన్ని నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. ఎక్కువ ప్రోటీన్ కావాలనుకునే వారికి కూడా ఈ బియ్యం ఓ వరం. అంతేకాదు, దాదాపు 50 శాతం మంది ప్రజలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ బియ్యం అన్ని సమస్యలతో పాటు ప్రోటీన్ లోపాన్ని కూడా పరిష్కరించే అవకాశం ఉంది.
ఈ బియ్యాన్ని త్వరలోనే మార్కెట్లో ప్రవేశపెట్టవచ్చు. డేటా ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ కింద ఇందుకు సంబంధించిన పనులు సీఎస్ఐఆర్ నెస్ట్లో జరిగాయి. ఈ బియ్యాన్ని ప్రయోగశాలలో పరీక్షించారు. ఇప్పుడు ఈ బియ్యాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టే సమయం వచ్చింది.
అందరికీ ఈ బియ్యం చేరేలా చర్యలు
ఈ సాంకేతికతను టాటర్ కన్స్యూమర్ ప్రోడక్ట్ లిమిటెడ్ అలాగే సోల్ ఫుడ్స్ సంస్థలకు బదిలీ చేస్తున్నారు. ఇంకా ఇతర సంస్థలను కూడా ఆహ్వానిస్తున్నారు. అధిక మోతాదులో ఉత్పత్తి చేసి.. ప్రతి వ్యక్తికి ఈ బియ్యం చేరేలా చేయడానికి కృషి చేస్తాం. ఎక్కువ ప్రోటీన్ లేదా తక్కువ జీఐ.. అలాగే, ఇనుము, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బి12 పోషకాలు ఒకే దాంట్లో కావాలనుకునే వారికి ఈ బియ్యం అందుబాటులో ఉంచారు.
🚨 Indian scientists develop ‘Designer Rice’ that could help fight diabetes and malnutrition. pic.twitter.com/mZ7L1DdLVg
— Indian Tech & Infra (@IndianTechGuide) April 5, 2026


