హన్మకొండ : బీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్.. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని ఆదేశించారు. గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో బీసీ కమిషన్ విచారణ చేపట్టింది. 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్పీడీసీఎల్లో చేపట్టిన నియామకాలు, రిజర్వేషన్ల అమలు, అభ్యర్థుల ఎంపికపై చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి విచారణ చేపట్టారు. ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా బీసీ సెల్ ఏర్పాటు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ముందుగా హెచ్ఆర్డీ డైరెక్టర్ సి.ప్రభాకర్.. ఎన్పీడీసీఎల్లో అమలు చేస్తున్న రోస్టర్ పాయింట్, రిక్రూట్మెంట్, బ్యాక్ లాగ్ వెకెన్సీపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పని చేసే ఆన్ మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ల గురించి సంస్థ ఆలోచించి తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు వినూత్న సేవలు అందిస్తున్నామని, సాంకేతికతను అందిపుచ్చుకుని విద్యుత్ భద్రతాప్రమాణాలు పాటిస్తున్నామన్నారు. చీఫ్ ఇంజనీర్లు టి.తిరుమల్ రావు, మాధవరావు, జాయింట్ సెక్రటరీ కె.రమేశ్, జీఎంలు శ్రీనివాసరావు, ఎం.హేమంత్ కుమార్, బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడెపాక కుమార స్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు జి.బ్రహ్మేంద్రరావు, ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు ఎన్.సదానందం, కార్యదర్శి నీలారపు రాజేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఐలయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వెంకటేష్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రంగు సత్యనారాయణ, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రమాకాంత్, తదితరులు పాల్గొన్నారు.
బీసీ కమిషన్ చైర్మన్
నిరంజన్ను కలిసిన కలెక్టర్..
తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ను హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కలిశారు. హనుమకొండకు వచ్చిన ఆయనను గురువారం నక్కలగుట్టలోని విద్యుత్ అతిథి గృహంలో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందించారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు.
టీజీ ఎన్పీడీసీఎల్లో
బీసీ సెల్ ఏర్పాటు చేయాలి
తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్
గోపిశెట్టి నిరంజన్


