సాక్షిప్రతినిధి, వరంగల్:
ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీల విడుదలకు రంగం సిద్ధమైంది. నిబంధనల ప్రకారం.. సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలను పంద్రాగస్టు, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా విడుదల చేస్తారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ముందస్తు విడుదలకు అర్హులైన 102 మందితో కూడిన జీవిత ఖైదీల జాబితాను ఖరారు చేసినట్లు తెలిసింది. ఆరుగురు మహిళలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 102 మంది అర్హత కలిగిన జీవిత ఖైదీల జాబితాకు సంబంధించిన ఫైలు సీఎం కార్యాలయ పరిశీలనలో ఉందని, త్వరలోనే జాబితాను ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. ఈ మేరకు వరంగల్ సెంట్రల్ జైలు ఎత్తివేత తర్వాత ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ జిల్లా జైళ్లల్లో శిక్ష అనుభవిస్తున్న ఉమ్మడి వరంగల్కు చెందిన 10 మంది పేర్లున్నట్లు తెలిసింది. ఈ మేరకు వారి వివరాలపై రాష్ట్ర హోంమంత్రిత్వశాఖ ఆరా తీసింది. కొందరు ఖైదీల కుటుంబ సభ్యుల నుంచి సమాచారం రాబట్టినట్లు సమాచారం.
నిబంధనల మేరకు..
సత్ప్రవర్తన కలిగే ఖైదీల శిక్షాకాలానికి జైలు అధికారులు ఏటా కొన్ని రోజులు కలుపుతారు. ఈ కాలాన్నే ‘రెమిషన్’ అంటారు. ఈ రెమిషన్ ప్రకారం ఖైదీలకు శిక్షకాలంలో వారి ప్రవర్తన ఆధారంగా ‘రెమిషన్’ వస్తోంది. ఏడాదిలో 130 రోజులు కన్నా పెంచే అవకాశం, అధికారం ఎవరికీ ఉండదు. మొదటి సంవత్సరం 60 రోజులతో పాటు 2, 3, 4, 5 సంవత్సరాలకు వరుసగా 120 రోజుల చొప్పున రెమిషన్ ఇస్తే ఐదేళ్లకు కలిపి 540 రోజులు అవతుంది. జీఓ ప్రకారం ఈ పద్ధతి న అర్హత ఉన్నవారికి క్షమాభిక్ష వర్తింపజేశారు. 2025 అ క్టోబర్ 27న హోంశాఖ జీఓఎంఎస్ 126 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీఓ ప్రకారం ప్రతీ నాలుగు నెలలకోసారి అర్హులైన జీవిత ఖైదీల జాబితా సిద్ధం చేసి, ఇందుకు ఏర్పాటు చేసిన సమీక్ష కమిటీ ముందు ఉంచాలి.
మరో జాబితా ఎప్పుడు?
2025 సంవత్సరం ఫిబ్రవరి 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు అర్హత కలిగిన జీవిత ఖైదీల విడుదలపై కసరత్తు జరిగింది. ఇలా కసరత్తు ద్వారా సిద్ధం చేసిన జాబితాను సమీక్ష కమిటీ పరిశీలించి 102 మంది పేర్లను ప్రభుత్వానికి పంపగా.. సీఎం పేషీలో పరిశీలనలో ఉంది. అయితే ఈ ఏడాది కూడా జనవరి 1 నుంచి మార్చి 31 వరకు కూడా అర్హులైన జీవితఖైదీల జాబితాను కూడా సిద్ధం చేయాల్సి ఉంది. ఇప్పటికే సిద్ధమైన జాబితాను పరిశీలించి అర్హులైన 102 మంది జీవిత ఖైదీలను విడుదల చేసి, ఈ ఏడాది మొదటి విడత జాబితాను కూడా సిద్ధం చేయాలని పౌరహక్కులు, మానవహక్కుల సంఘాల నాయకులు కోరుతున్నారు.
తక్షణమే విడుదల చేయాలి..
ప్రభుత్వం న్యాయం, సంస్కరణ, మానవతా దృక్ఫథాన్ని ప్రదర్శించి జీవిత ఖైదీల విడుదల ప్రక్రియను కొనసాగించాలి. జనవరి 1 నుంచి 31 మార్చి వరకు సంబంధించిన అర్హుల జాబితా సిద్ధం చేసే ప్రక్రియ వెంటనే ప్రారంభించాలి. ఇప్పటికే ఆమోదానికి పంపిన 102 మంది జీవిత ఖైదీల విడుదల ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలి. ప్రస్తుతం సిద్ధమవుతున్న తదుపరి జాబితాలో ఉన్న ఖైదీలను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయడానికి పరిశీలించాలి. – ఎస్.జీవన్కుమార్,
రాష్ట్ర నాయకుడు, మానవ హక్కుల వేదిక


