హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్
హన్మకొండ అర్బన్: జిల్లాలో రబీ సీజన్కు సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు రైస్ మిల్లర్లు కేటాయించిన ధాన్యాన్ని తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోలు, కేటాయింపు, దిగుమతి అంశాలపై జిల్లాలోని రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైస్ మిల్లులకు కేటాయింపులు చేపడతామన్నారు. అదనపు కలెక్టర్ ఎన్. రవి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఎండీ వాజీద్ అలీ, జిల్లా సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ మేనేజర్ మహేందర్, ఇతర అధికారులు, జిల్లాలోని రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
ఈ నెల 31లోగా ఉపాధి పనులు పూర్తి చేయాలి
జిల్లాలో ఉపాధి హామీ పనులు ఈ నెల 31లోగా పూర్తి చేయాలని, పంచాయతీల్లో ఇంటి పన్నుల వసూళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి డీఆర్డీఓ మేన శ్రీను, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, పంచాయతీరాజ్ ఈఈ సైదుల్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ సిద్ధార్థ నాయక్ తదితర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులతో ఉపాధి పనులు, ఇంటి పన్నుల వసూలు, తాగునీరు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై సమీక్షించారు. పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో డీఎల్పీఓలు రవిబాబు, గంగ భవాని తదితర అధికారులు పాల్గొన్నారు.


