న్యూస్రీల్
సాక్షిప్రతినిధి, వరంగల్:
గ్రేటర్ వరంగల్లో గ్యాస్ కొరత, ధరల పెరుగుదల కారణంగా చిన్న, మధ్యతరహా హోటళ్లు, టిఫిన్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ఎల్పీజీ సరఫరాలో అంతరాయాలు ఏర్పడి, చిరు వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గ్యాస్ కొరత ప్రభావం, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీగా పెరగడం సరఫరాలో ఆలస్యం, బ్లాక్ మార్కెట్ పెరుగుదల కారణంగా చిన్న హోటళ్లు కుదేలవుతున్నాయి. ఇప్పటికే వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని 30 శాతం హోటళ్లు, పాస్ట్ఫుడ్ సెంటర్లు మూసివేశారు.
చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం
గ్రేటర్ వరంగల్ ట్రైసిటీలో చిరు హోటళ్లు, పాస్ట్ఫుడ్ సెంటర్లు 6,500 నుంచి 9,000 వరకు ఉన్నట్లు అధికారుల అంచనా. వీటిని ఆధారం చేసుకుని సుమారు 25 వేల నుంచి 30 వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. ఒక్కో హోటల్, ఫా స్ట్ఫుడ్ సెంటర్లపై సగటున ముగ్గురి నుంచి ఐదుగురి వరకు ఉపాధి పొందుతున్నారు. గ్యాస్ కొరతతో 650 నుంచి 900 వరకు హోటళ్లు, సెంటర్లు మూతపడగా.. 2 వేల నుంచి 2,500 కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. కమర్షియల్ ఎల్పీజీ రూ.2 వేలు దాటడం.. అదీ సరిపడా సరఫరా లేని కారణంగా ఒక రోజు నడిస్తే మరో రోజు మూసేయాల్సిన పరిస్థితి.
గ్యాస్ కొరత అరికడితేనే..
ట్రైసిటీలో చిన్న హోటళ్లు, టిఫిన్, ఫాస్ట్ఫుడ్, ఇతరత్రా సెంటర్లు నడపాలంటే రోజుకు ఒకటిన్నర నుంచి రెండు సిలిండర్లు అవసరం. ఉదయం టిఫిన్కు ఒక సిలిండర్, మధ్యాహ్నం భోజనం వండేందుకు 1 సిలిండర్, సాయంత్రం స్నాక్స్కు సగం సిలిండర్ వినియోగించాల్సి వస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ లెక్కన త్రినగరిలో రోజుకు సగటున 10 వేల గ్యాస్ సిలిండర్ల వరకు వినియోగిస్తున్నట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ‘రోజువారీ వ్యాపారం పూర్తిగా గ్యాస్ ఆధారితం కావడంతో చిరు వ్యాపారులైన తాము ఎక్కువగా నష్టపోతున్నామని వాపోతున్నారు.
అంచనా గణాంకాలు
(గ్రేటర్ వరంగల్)
చిరు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు4,500 – 6,000
ఫాస్ట్ఫుడ్ సెంటర్లు
2,000 – 3,000
మొత్తం ఫుడ్ ఔట్లెట్లు
6,500 – 9,000
ఆధారపడిన కుటుంబాలు
25,000 – 35,000
ఒక్కో హోటల్పై జీవనాధారం
సగటున 4–5 మంది
తాత్కాలికంగా మూతపడినవి
650 నుంచి 900 వరకు
సంక్షోభం ప్రభావం చూపే
కుటుంబాలు
సుమారు 2,000–2,500
ఉపాధి కోల్పోతున్నాం..
ఫోర్ట్రోడ్డు పెట్రోల్ బంక్ జంక్షన్లో 30 ఏళ్లుగా హోటల్, టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాం. వాణిజ్య సిలిండర్ల కొరతతో పది రోజులుగా హోటల్ మూసివేశాం. మా దగ్గర ఐదుగురు కార్మికులు పని చేస్తారు. వారూ ఉపాధి కోల్పోవాల్సి వస్తోంది. మాలాంటి వారి కోసం ప్రభుత్వం ఆలోచించి సిలిండర్లు వచ్చేలా చూడాలి.
– సతీశ్ హోటల్ నిర్వాహకుడు, ఖిలావరంగల్
ఆర్థికంగా చితికిపోతున్నాం..
రోజూ ఇడ్లీ, పూరి, దోశ, వడ తయారు చేసేవాళ్లం. మంచి గిరాకీ ఉండేది. ప్రతీ రోజు రూ.3 వేల నుంచి రూ. 5వేల వ్యాపారం సాగేది. యుద్ధం ప్రభావంతో గ్యాస్ దొరకట్లేదు. పది రోజులుగా టిఫిన్ సెంటర్ బంద్ చేసుకున్నాం. అడ్డాకు నెలకు రూ.5 వేలు అద్దె భారమవుతోంది.
– శ్రీనివాస్ టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు, ఫోర్ట్ రోడ్డు
●
‘గ్రేటర్’లో మూతపడుతున్న చిన్న, మధ్య తరహా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు
కమర్షియల్ బదులు
డొమెస్టిక్ వాడితే కేసులు
సంక్షోభంలో చిరు వ్యాపారుల కుటుంబాలు
ప్రత్యామ్నాయ ఉపాధి లేక ఇబ్బందులు
ఈ ఫొటోలోని వ్యక్తి పేరు అహ్మద్. హనుమకొండలోని కిషన్పురలో టిఫిన్ సెంటర్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కమర్షియల్ ఎల్పీజీ దొరకక టిఫిన్ సెంటర్ను తాత్కాలికంగా మూసేశారు. టిఫిన్ సెంటర్ నడిస్తేనే ఆ కుటుంబం గడిచేది. ఇంట్లో కూడా కట్టెల పొయ్యితో వంట చేసుకుంటున్నారు. ‘కమర్షియల్ సిలిండర్ ఎక్కువ రేట్ అయినా కొందాం అంటే దొరకట్లేదు. ఇంటిల్లిపాదికి ఇబ్బందిగా ఉంది. టిఫిన్ సెంటర్ నడిస్తేనే మాకు ఆదాయం. లేకపోతే కష్టమే’ అని అహ్మద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
వరంగల్ ఫోర్ట్రోడ్డుపై కర్రీపాయింట్ నడుపుతున్న సంపత్రావు గ్యాస్ బుక్ చేసినా రాలేదు. ప్రస్తుతం కట్టెల పొయ్యిపై నడిపిస్తున్నాడు. కొరతతో మెనూ సగానికి తగ్గించాడు. గతంలో రోజుకు రూ.2వేల వరకు గిరాకీ అయ్యేది. మెనూలో అన్ని రకాలు లేకపోవడంతో కొనే వారు సైతం తగ్గిపోయారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.
వరంగల్ స్టేషన్ రోడ్డులో కర్రీపాయింట్ నిర్వహిస్తున్న రమ వంట గ్యాస్ దొరకడం లేదని వారం నుంచి కర్రీపాయింట్ బంద్ పెట్టింది. ఆ తర్వాత కట్టెలతో వ్యాపారం కొనసాగిద్దామని ప్రయత్నించింది. కట్టెల ధరలు సైతం ఎక్కువగా ఉన్నయాని కర్రీ పాయింట్ మూసేసింది. దీంతో చిన్నాచితకా పనులకు వెళ్లాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.


