తడిసిన పత్తి.. మక్క నేలపాలు
సాక్షి, వరంగల్: ఆరుగాలం పంట పడించి అమ్ముకునేందుకు మార్కెట్కు తీసుకొస్తే ఇక్కడ కూడా సౌకర్యాల లేమితో పత్తి బస్తాలు తడిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం కురిసిన అకాల వర్షంతో ఏనుమాముల మార్కెట్లో ఆరబోసిన మొక్కజొన్నలు, అమ్మేందుకు తీసుకొచ్చిన పత్తి బస్తాలు తడిశాయి. సుమారు 30 మంది రైతులకు సంబంధించిన సరుకు అరగంటకుపైగా కురిసిన వానతో ఆగమాగమైంది. మక్కలు నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి కనిపించింది.
షెడ్లు కరువు..
ఆసియాలోనే రెండో అతి పెద్దదైన ఏనుమాముల మార్కెట్లో ఎక్కువ మొత్తంలో షెడ్లు లేకపోవడం కూడా ప్రకృతి ప్రకోపం సమయంలో అన్నదాతలకు కడగండ్లు మిగులుస్తున్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. వీటికితోడు మూడేళ్ల నుంచి పాలకవర్గం లేకపోవడం, అదే సమయంలో ఇన్చార్జ్ కార్యదర్శితోనే పాలన సాగిస్తుండడంతో పూర్తిస్థాయిలో అధికారులు దృష్టి సారించక పోవడం కూడా రైతులకు సరైన సౌకర్యాలు అందడం లేదని రైతు సంఘాలు అంటున్నాయి. వర్షం కురిసే సమయంలో వచ్చే వరద నీరు సాఫీగా వెళ్లేందుకు డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే మార్కెట్లో వరదనీరు నిలిచే పరిస్థితి ఉందని మండిపడుతున్నాయి. మార్కెట్లోకి వచ్చిన రైతుకు సరుకు షెడ్ల కింద పెట్టుకోవాలని మార్కెట్ సిబ్బంది అవగాహన కల్పించడంలో విఫలమవడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది.
వానకు తడిసిందని ‘తరుగు’
మంగళవారం జెండా పాట నిర్వహించే సమయంలోనే వర్షం రావడం సుమారు గంటకు పైగా ఎడతెరిపిలేకుండా కురవడంతో ఆరుబయట పెట్టిన పత్తి బస్తాలు తడిసిపోయాయి. యార్డు పైన పడిన నీరు వచ్చేందుకు ఏర్పాటు చేసిన పైపు కిందనే బస్తాలు పెట్టడంతో కొన్ని పత్తి బస్తాలు పూర్తిగా తడిసిపోయాయి. వర్షం తగ్గాక వ్యాపారులు రావడంతో సుమారు మూడు గంటలు ఆలస్యంగా కాంటాలు ప్రారంభించారు. బస్తాలు తడవడంతో వ్యాపారులు ప్రతీ క్వింటాకు కిలోన్నర చొప్పున తరుగుకింద మినహాయించుకున్నట్లు తెలిసింది. అయితే మార్కెట్కు వచ్చి తడిసిన పత్తి, మక్కలను జేడీఎం శ్రీనివాస్, డీఎంఓ సురేఖ పరిశీలించారు.
కొట్టుకుపోయిన ధాన్యం..
హసన్పర్తి: వంగపహాడ్ సమీపంలోని జాతీయ రహదారిపై ఆరబోసిన వడ్లు వర్షానికి కొట్టుకుపోయాయి. వంగపహాడ్కు చెందిన రఘుపతిరెడ్డి రెండు రోజుల క్రితం ఆరున్నర ఎకరాల్లో వరిపంట కోసి జాతీయ రహదారిపై ఎండకు ఆరబోశారు. తేమశాతం వచ్చినప్పటికీ మరో సారి ఆరబోసి కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మంగళవారం కురిసిన వర్షానికి వడ్లు కాల్వ పాలయ్యాయని, సుమారు రూ.3.50 లక్షల నష్టం వాటిల్లినట్లు కన్నీటి పర్యంతమయ్యాడు.
వర్షానికి ఏనుమాముల మార్కెట్లో ఆగమాగం
పాలకవర్గం లేక, పూర్తిస్థాయి
కార్యదర్శి లేక తిప్పలు
పర్యవేక్షణ లేమితో సౌకర్యాలు నిల్.. ఇబ్బందుల్లో రైతులు
తడిసిన పత్తి.. మక్క నేలపాలు
తడిసిన పత్తి.. మక్క నేలపాలు


