
మినీ బ్యాంకులో రూ.59 వేలు గోల్మాల్
నర్సంపేట రూరల్: ఎస్బీఐ మినీ బ్యాంక్ (వినియోగదారుల సేవా కేంద్రం)లో డబ్బులు గోల్మాల్ అయిన ఘటన చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన అడ్డగట్ల స్రవంతి.. గ్రామంలో పది సంవత్సరాలుగా ఎస్బీఐ మినీ బ్యాంక్ను నడిపిస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన ఆరెల్లి సాంబయ్య ప్రతి ఏడాది రూ.1,506 చొప్పున 21 సంవత్సరాలపాటు ఎల్ఐసీ ఇన్సూరెన్స్ను చెల్లించాడు. ఈ ఏడాది మార్చి 19వ తేదీన ఎల్ఐసీకి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు రూ.59,581 తన అకౌంట్లో జమ అయ్యాయి. నగదు జమ అయ్యాయా.. లేదా.. లేదా అని తెలుసుకునేందుకు స్థానిక ఎస్బీఐ మినీ బ్యాంక్కు వెళ్లాడు. వెళ్లినప్పుడల్లా మినీ బ్యాంక్ నిర్వాహకురాలు స్రవంతి వేలిముద్ర వేయించుకొని చెక్ చేసినట్లుగా నటించి డబ్బులు పడలేదని చెప్పడంతో వెనుదిరిగాడు. ఎన్నిసార్లు చెక్ చేసినా ఫలితం లేకపోవడంతో బాధితుడు బ్యాంక్కు వెళ్లి మినీ స్టేట్మెంట్ తీసుకోవడంతో బండారం బయటపడింది. మార్చి 19వ తేదీన ఎల్ఐసీకి సంబంధించి రూ.59,581 జమ అయ్యాయని తేలింది. మార్చి 23వ తేదిన రూ. 29 వేలు, ఏప్రిల్ 4వ తేదీన రూ.30 వేలు మొత్తం రూ. 59 వేలు డ్రా చేసినట్లు ఉండడంతో లబోదిబోమంటూ వెళ్లి మినీబ్యాంక్ నిర్వాహకురాలిని నిలదీశాడు. అప్పుడే వేలిముద్ర వేసి డబ్బులు డ్రా చేసుకున్నావని నిర్వాహకురాలు చెప్పడంతో సాంబయ్య అవాక్కయ్యాడు. నా డబ్బులు నాకు ఇప్పించాలని కోరుతూ బాధితుడు మినీబ్యాంక్ ఎదుట కుటుంబ సభ్యులతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్తులు వచ్చి మినీ బ్యాంక్ నిర్వాహకురాలిని నిలదీయగా ఏం చేసుకుంటారో.. చేసుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతుందని, తక్షణమే ఆమైపె చర్యలు తీసుకొని బాధితుడికి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదే విషయమై ఎస్సై రాజేశ్రెడ్డిని వివరణకోరగా.. బాధితుడి నుంచి ఫిర్యాదు అందిందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. మినీబ్యాంక్ నిర్వాహకురాలు స్రవంతిని వివరణ కోరగా ఆరెల్లి సాంబయ్యకు ఎల్ఐసీ ఇన్సూరెన్స్ డబ్బులు రాగానే రెండు దఫాలుగా వేలిముద్ర వేసి రూ.59 వేలు డ్రా చేసి ఇచ్చానని, నగదు ఇచ్చే క్రమంలో మా బుక్లో సంతకాలు సైతం చేయించానని, కావా లనే డబ్బులు ఇవ్వలేదని సాంబయ్య తప్పుడు ఆరోపణలు చేస్తున్నడని చెప్పడం కొసమెరుపు.
వేలిముద్ర పెట్టించుకుని స్వాహా చేసిన ఎస్బీఐ మినీ బ్యాంక్ ఆర్గనైజర్
లబోదిబోమంటున్న బాధితుడు