
ఆస్పత్రి పనులు పూర్తి చేయాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద
ఎంజీఎం: వరంగల్లో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిని కలెక్టర్ గురువారం సందర్శించి సంబంధిత అధికారులతో పనుల పురోగతిపై సమీక్షించారు. సివిల్, ఎలక్ట్రికల్ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతీ అంతస్తులోని నిర్మాణ స్థితిగతులను తెలుసుకోవాలని సూచించారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో ఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ కిశోర్, కేఎంసీ ప్రిన్సిపాల్ సంధ్యారాణి, ఆర్ఎంఓలు, వివిధ విభాగాల అధిపతులు, ఆర్అండ్బీ ఇంజనీర్లు, ఎల్అండ్టీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పంట ఉత్పత్తుల కొనుగోళ్లు చేపట్టాలి
న్యూశాయంపేట: పారదర్శకంగా పంట ఉత్పత్తుల కొనుగోళ్లను చేపట్టాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ధాన్యం పత్తి, మొక్కజొన్నల కొనుగోళ్లపై గురువారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ మద్దతు ధరలతో పంటల కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీఆర్డీఓ రాంరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ పాల్గొన్నారు.
గడువులోగా ఇందిరమ్మ ఇళ్లు పూర్తిచేయాలి
నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, ఉపాధి హామీ పథకం అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 9,457 ఇళ్లకు ఇప్పటివరకు 4,941 ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు. ఎస్హెచ్జీల నుంచి రుణాలు ఇప్పించి పెండింగ్లో ఉన్న 4,516 ఇళ్ల పనులు చేపట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉపాధి హామీలో పని కల్పించేందుకు జాబ్ కార్డులు అందించాలన్నారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డిప్యూటీ కమిషనర్ ప్రసన్న, హౌసింగ్ పీడీ గణపతి, డీపీఓ కల్పన, పీఆర్ ఈఈ ఇజ్జగిరి పాల్గొన్నారు.
నాణ్యమైన విద్య అందించాలి
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, విద్యార్థులకు కల్పించే కనీస సదుపాయాలపై మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాలల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల భవిష్యత్ తీర్చిదిద్దే దేవాలయాలుగా నిలవాలన్నారు. డీఈఓ రంగయ్యనాయుడు, ఏఎస్ఓ వేణుగోపాల్, అధికారులు పాల్గొన్నారు.