నర్సంపేట: చెన్నారావుపేట మండలం లింగాపురం గ్రామానికి చెందిన పల్నాటి కరుణాకర్ సతీమణి లిఖిత ఆదర్శంగా నిలిచింది. తన మూడు నెలల పాప వేదస్యకు తల్లిపాలు సరిపడా అందించిన అనంతరం మిగిలిన ఏడు లీటర్ల పాలను నిల్వ చేసి బుధవారం హనుమకొండలోని ప్రభుత్వ మాతాశిశు సంరక్షణ కేంద్రానికి అందించింది. ఇంతకు ముందు ఆగస్టు 29న నాలుగు లీటర్ల తల్లిపాలు అందించింది. ఇలా దానం చేయడం ద్వారా పలు కారణాల వల్ల తల్లిపాలు అందని శిశువులకు అవసరమైన పోషణ అందించగలుగుతారని లిఖిత తెలిపారు. ఈ కార్యక్రమం ప్రతీ తల్లి, శిశువు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ప్రేరణగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు.
బకెట్ నుంచి వాటర్ హీటర్ తీస్తుండగా..
విద్యుదాఘాతంతో మహిళ మృతి.. బొంతగట్టునాగారంలో ఘటన
తరిగొప్పుల: స్నానానికి వేడి నీళ్ల కోసం బకెట్లో పెట్టిన వాటర్ హీటర్ తీస్తుండగా షాక్ తగిలి ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటన బుధవారం మండలంలోని బొంతగట్టునాగారంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీదేవి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పిల్లి లింగమ్మ(48) బాత్రూంలో స్నానానికి వేడి నీళ్ల కోసం బకెట్లో వాటర్ హీటర్ పెట్టింది. అనంతరం స్విచ్ ఆఫ్ చేసి బకెట్లోని వాటర్ హీటర్ తీస్తుండగా విద్యుత్ సరఫరా అయ్యింది. దీంతో షాక్ తగిలి మృతి చెందింది. మృతురాలి భర్త మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇంటర్ వర్సిటీ పోటీలకు ఆర్చరీ జట్ల ఎంపిక
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్బోర్డు ఆధ్వర్యంలో బుధవారం ఆర్చరీ పురుషుల, మహిళల జట్ల ఎంపికలు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఆర్చరీ క్రీడాకారులు తన్వీర్కౌసర్, త్రిశూల్,అశ్విత్, రమ్య, మనసుర హాసిభ, వెంకటేష్, ఆనంద్, గంగరాజు పాల్గొన్నారు. ఈ జట్లు ఈఏడాది అక్టోబర్లో పంజాబ్లోని గురుకాశీ యూనివర్సిటీ, పఠాన్లోని హెచ్ఎన్ యూనివర్సిటీలో నిర్వహించనున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో పాల్గొంటారని కేయూ స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య తెలిపారు. డాక్టర్ ఏటీబీటీ ప్రసాద్, డాక్టర్ కుమారస్వామి, రాజేశ్, ఆంజేయులు, తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం
● జిల్లా కేంద్రం శివారులో ఘటన
ములుగు: జిల్లా కేంద్రం శివారులోని వివేకవర్థిని పాఠశాల సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుగులోత్ శ్రీను (35) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. ప్రేమ్నగర్కు చెందిన శ్రీను ద్విచక్రవాహనంపై గట్టమ్మ నుంచి తన ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో ములుగు నుంచి హనుమకొండ వైపునకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దీంతో శ్రీను అక్కడికక్క డే దుర్మరణం చెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

తల్లిపాలు అందించిన లిఖిత