
ఆర్మీ ర్యాలీకి పకడ్బందీ ఏర్పాట్లు
హన్మకొండ అర్బన్: హనుమకొండ జేఎన్ఎస్లో నవంబర్ 10 నుంచి 23 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో ఆర్మీ అధికారులు, కలెక్టర్, వివిధ శాఖల అధికారులు ర్యాలీ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై సమావేశమై చర్చించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. ఈ ఏడాది హనుమకొండ జిల్లాలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించే అవకాశం దక్కడంతో విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. సికింద్రాబాద్ లోని ఆర్మీ రిక్రూట్మెంట్ కల్నల్ సునీల్ యాదవ్ మాట్లాడుతూ.. ఇప్పటికే ఆన్లైన్ విధానంలో నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన 9 వేల మంది అభ్యర్థులకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ర్యాలీ నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్, వివిధ శాఖల జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో డీఆర్ఓ వై.వి. గణేశ్, ఆర్మీ మేజర్ ప్రకాశ్ రాయ్, ఆర్మీ అధికారులు గురు దయాల్ సింగ్, సుభాష్, వి.వి.నాయుడు, వినోద్కుమార్ శర్మ, మనీశ్కుమార్, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, డీఎంహెచ్ఓ అప్పయ్య, సీపీఓ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జీపీఓలకు కౌన్సెలింగ్
జిల్లాలోని 123 క్లస్టర్లకు 125 మంది జీపీఓల కేటాయింపు ప్రక్రియ బుధవారం కలెక్టరేట్లో పారదర్శకంగా జరిగినట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన ఈ కౌన్సెలింగ్ వీడియోగ్రఫీతో డీఆర్ఓ వైవీ గణేశ్ ఆధ్వర్యంలో సాగినట్లు పేర్కొన్నారు. 128 మందిలో ముగ్గురు విముఖత చూపించగా 125 మంది జీపీఓలు కౌన్సెలింగ్కు హాజరైనట్లు వివరించారు.
కలెక్టర్ స్నేహ శబరీష్
ఈసారి వేదికవ్వనున్న జేఎన్ఎస్
నవంబర్ 10 నుంచి నిర్వహణ
ఏర్పాట్లపై అధికారులతో సమావేశం