
ఉమ్మడి వరంగల్ స్పెషల్ ఆఫీసర్గా శశాంక
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ స్పెషల్ ఆఫీసర్గా ఐఏఎస్ అధికారి కె.శశాంక నియమితులయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా పది ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం ఉమ్మడి వరంగల్కు 2013 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన శశాంక పేరును ప్రకటించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) కమిషనర్గా వ్యవహరిస్తున్న ఆయన గతంలో మహబూబాబాద్ కలెక్టర్గా పని చేశారు. ఇటీవల ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి కమిషనర్గా నియమించిన ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ స్పెషల్ ఆఫీసర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
మహిళా హాస్టల్లో
షార్ట్సర్క్యూట్..
● విద్యుత్ సరఫరాకు అంతరాయం
● వర్షంలో విద్యార్థినుల ఆందోళన
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని పద్మాక్షి మహిళా హాస్టల్ ఏ బ్లాక్లో శుక్రవారం రాత్రి 9గంటలకు షార్ట్సర్క్యూట్తో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పీజీకోర్సుల విద్యార్థినులు ఇబ్బందులు పడ్డారు. మొదటిగేట్ వద్దకు వెళ్లి వర్షంలోనే ఆందోళనకు దిగారు. హాస్టల్ సమీపంలోనే ఉండే ఈ బ్లాక్కి తమను షిఫ్ట్ చేయించాలని డిమాండ్ చేశారు. కేయూసీ సీఐ రవికుమార్, ఎస్ఐలు రవీందర్, శ్రీకాంత్ ఘటనాస్థలికి చేరుకుని విద్యార్థినులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఎలక్ట్రీషియన్లు మరమ్మతు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. రిజిస్ట్రార్ రామచంద్రం, హాస్టళ్ల డైరెక్టర్ రాజ్కుమార్ విద్యార్థినుల వద్దకు వచ్చి మాట్లాడారు. శిథిలమైన ఏ బ్లాక్లోకి వెళ్లబోమని ఈ– బ్లాక్ హాస్టల్లోకి ఇప్పుడే షిఫ్ట్ చేయాలని డిమాండ్ చేయగా.. రిజిస్ట్రార్ రామచంద్రం షిఫ్టింగ్కు ఓకే చెప్పారు. దీంతో రాత్రి ఒక్కొక్కరుగా ఈ–బ్లాక్లోకి షిఫ్ట్ అయ్యారు.
కేయూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
బీఓఎస్గా శ్రీనివాస్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా (బీఓఎస్) ఆవిభాగం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చీకటి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈమేరకు కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీసీ ప్రతాప్రెడ్డి ఉత్తర్వుల కాపీని శ్రీనివాస్కు అందజేశారు. ఇప్పటి వరకు బీఓఎస్గా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ అకుతోట శ్రీనివాస్ నుంచి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరిస్తారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలు
పరిష్కరించాలి..
హన్మకొండ: ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న కోరారు. శుక్రవారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయంలో ఆర్ఎం డి.విజయభానును ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కలిశారు. ఈసందర్భంగా పెండింగ్లో ఉన్న అప్పీళ్లను పరిశీలించి పరిష్కరించాలని కోరారు. మంగపేట, ములుగులో సిబ్బందికి రెస్ట్ రూం సౌకర్యం కల్పించాలని ఆర్ఎంకు విన్నవించారు. ఆర్ఎం డి.విజయ భాను సానుకూలంగా స్పందించినట్లు ఈదురు వెంకన్న తెలిపారు. నైట్ హాల్ట్ సిబ్బందికి రెస్ట్ రూం సౌకర్యం కల్పిస్తామని చెప్పారన్నారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ వరంగల్ రీజియన్ కార్యదర్శి ఎ.శ్రీనివాస్, బి.జనార్దన్, టి.శ్రీనివాస్, పోతరాజు రమేశ్, బి.రాకేశ్, రాము పాల్గొన్నారు.

ఉమ్మడి వరంగల్ స్పెషల్ ఆఫీసర్గా శశాంక