
నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద
మామునూరు: విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద సూచించారు. మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో రూ.50 లక్షల పీఎం శ్రీనిధి నిధులతో నిర్మించిన కృత్తిమ మేధో ఆధునిక సాంకేతిక నైపుణ్యాభివృద్ధి (సంకల్ప్) ల్యాబ్ను కలెక్టర్ శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. ఈల్యాబ్లో విద్యార్థులు రోబోటిక్స్ ఐఓటీ, బేసిక్ ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రెన్యువల్ ఎనర్జీ సిస్టం వంటి అంశాలను ప్రయోగాత్మకంగా నేర్చుకోవాలని కోరారు. అంతకు ముందు కలెక్టర్ సత్యశారద నవోదయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పూర్ణిమ, ఉపాధ్యాయులు సురేశ్, రామలింగయ్య పాల్గొన్నారు.
మత్తు పదార్థాల నివారణకు చర్యలు
న్యూశాయంపేట: మత్తు పదార్థాలను నివారించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్లో డీసీపీ అంకిత్కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి శుక్రవారం జిల్లాస్థాయి నార్కోటిక్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల నియంత్రణ, నషాముక్త్ భారత్లో భాగంగా తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. పోలీస్, విద్య, మహిళాశిశు సంక్షేమశాఖ అధికారులు సమన్వయంతో విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమీక్షలో జిల్లా అధికారులు రాంరెడ్డి, జ్ఞానేశ్వర్, రాజమణి, సాంబశివరావు, పోలీసులు, నార్కోటిక్ అధికారులు పాల్గొన్నారు.
రాత పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి
గ్రామపాలన అధికారి, లైసెన్స్డ్ సర్వేయర్ రాత పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామపాలన అధికారి పరీక్షకు 25 మంది, లైసెన్స్డ్ సర్వేయర్ పరీక్షకు 304 మంది హాజరు కానున్నట్లు తెలిపారు. ఈనెల 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వరంగల్ ఏవీవీ జూనియర్, డిగ్రీ కళాశాలలో వీఆర్ఓ పరీక్ష, ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు, తిరిగి 2 నుంచి సాయంత్రం ఐదుగంటల వరకు సర్వేయర్ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.
ఐటీ శిక్షణ కేంద్రం ప్రారంభానికి ఏర్పాట్లు..
వరంగల్ పోచమ్మమైదాన్లోని బల్దియా వార్డు ఆఫీస్ పైఅంతస్తులో టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) ఐటీ శిక్షణ కేంద్రం ప్రారంభానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని, వరంగల్ తూర్పు పరిధిలోని కమ్యూనిటీ రిసోర్స్ సెంటర్స్, మహిళా స్వశక్తి భవనాలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని మెప్మా భవనాల భౌతిక స్థితిగతులపై మెప్మా, బల్దియా ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. డీఆర్వో విజయలక్ష్మి, బల్దియా అదనపు కమిషనర్ జోనా, అధికారులు శ్రీనివాస్, గణపతి, రాజ్కుమార్, రంగారావు, రేణుక, రమేశ్ పాల్గొన్నారు.