
అర్హత లేని వైద్య కేంద్రాల్లో ‘టీజీఎంసీ’ తనిఖీలు
ముగ్గురు నకిలీ వైద్యులపై కేసు
నమోదుకు సిఫార్సు
ఎంజీఎం: కేయూ క్రాస్, భీమారం, ఎర్రగట్టుగుట్ట ప్రాంతాల్లో ఎలాంటి విద్యార్హతలు లేకుండా వైద్యం అందిస్తున్న క్లినిక్లలో తెలంగాణ వైద్య మండలి (టీజీఎంసీ) సభ్యులు ఆదివారం తనిఖీలు నిర్వహించినట్లు టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ వి.నరేశ్కుమార్ తెలిపారు. కేయూ క్రాస్ రోడ్డులోని అమైరా క్లినిక్ (డెర్మటాలజీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, పీఆర్పీ థెరపీ, లేజర్ థెరపీ)లో విద్యార్హతలు లేకుండా ఎండీ డెర్మాటలజీ, ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ చదివిన వైద్యులు అందించే చికిత్సలను క్లినిక్లలో నిర్వాహకులు ఫజ షైక్, ఇమ్రాన్ ఖాన్ అందిస్తున్నట్లుగా అధికారులు గుర్తించినట్లు తెలిపారు. భీమారం ఇందిరాగాంధీ విగ్రహం సమీపంలోని శ్రీనివాస్ క్లినిక్ను నిర్వాహకుడు ఇ.శ్రీనివాస్ ఎలాంటి వైద్య అర్హతలు లేకుండానే క్లినిక్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఎర్రగట్టుగుట్టలోని ఎస్ఆర్ఆర్ డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకుడు బి.అనిల్ కూడా ల్యాబ్ టెక్నీషియన్, డయాగ్నస్టిక్ సెంటర్ అనుమతి లేకుండా, వైద్యుల పర్యవేక్షణ లేకుండానే సెంటర్ను నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేసేందుకు సిఫార్సు చేసినట్లు తెలిపారు. తనిఖీల్లో వరంగల్ లీగల్ యాంటీ క్వాకరీ కమిటీ చైర్మన్ డాక్టర్ అన్వర్ మియా, సెక్రటరీ డాక్టర్ వెంకటస్వామి, హనుమకొండ జిల్లా అదనపు డీఎంహెచ్ఓ మదన్మోహన్ పాల్గొన్నారు.