
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ రెవెన్యూ మేళాకు బుధవారం 12 ఫిర్యాదులు వచ్చాయి. నూతన భవన నిర్మాణం, ఆస్తి పన్నుల సవరణలు, ఖాళీ స్థలం, పేరు మార్పిడి తదితర సమస్యలపై కాశిబుగ్గ సర్కిల్ 5, కాజీపేట సర్కిల్ 7 దరఖాస్తులు వచ్చినట్లు బల్దియా అడిషనల్ కమిషనర్ అనిసుర్ రషీద్ తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ అనిల్కుమార్, సీనియర్ అసిస్టెంట్ ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు.
విరబూసిన ‘మమ్మీల్లారియ’
శాయంపేట: పెద్దకోడెపాకకు చెందిన వన ప్రేమికుడు కోమనేని రఘు ప్రకృతి వనంలో పెంచిన మెక్సికోకు చెందిన కాక్టీసీ జాతి మొక్క ‘మమ్మీల్లారియా అల్బిలనాట’ మొదటిసారిగా బుధవారం వికసించింది. ఈ మొక్క రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతాల్లో పెరుగుతుందని, 2018లో ఆ రాష్ట్రం నుంచి తెప్పించినట్లు రఘు తెలిపారు. ఆరేళ్ల తరువాత వికసించిన అరుదైన పుష్పాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు వస్తున్నారని పేర్కొన్నారు.
న్యూ ఎడ్యుకేషన్ పాలసీపై
ఆన్లైన్ శిక్షణ
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సౌజన్యంతో న్యూ ఎడ్యుకేషన్ పాలసీపై ఆన్లైన్లో అధ్యాపకులకు ఎనిమిది రోజుల ఓరియంటేషన్ శిక్షణ తరగతులను నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ బుధవారం ప్రారంభించారు. ‘పరిశోధన, అభివృద్ధి’ అనే అంశాలపై ఆయన ప్రసంగించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ టి.కిషోర్కుమార్, 190 మంది అధ్యాపకులు పాల్గొన్నారు.
కేయూ పీజీ మొదటి
సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంటీఎం, ఎంఎస్డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, అండ్ ఎంఎల్ఐఎస్సీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు మార్చి 1 నుంచి నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఎస్.జ్యోతి తెలిపారు. మార్చి 1, 4, 6, 11, 13, 15 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల జరిగే ఈ పరీక్షలకు 5,512 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందుకు మొత్తం 33 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వారు వివరించారు.
26 నుంచి కేయూ పార్ట్టైం
అధ్యాపకుల సమ్మె
● రిజిస్ట్రార్కు సమ్మెనోటీసు అందజేత
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో పనిచేస్తున్న పార్ట్టైం అధ్యాపకులను కాంట్రాక్టు అధ్యాపకులుగా కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 26 నుంచి సమ్మె చేయనున్నారు. ఈ మేరకు కేయూ పార్ట్టైం అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ వై.రాంబాబు అసోసియేషన్ బాధ్యులు డాక్టర్ దేవోజీ నాయక్ ఇతర బాధ్యులు బుధవారం కేయూ రిజిస్ట్రార్ పి.మల్లారెడ్డికి సమ్మెనోటీసు అందజేశారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ గతంలో వర్సిటీలో 16 పీరియడ్లతో పనిచేసే పార్ట్టైం అధ్యాపకులను కాంట్రాక్టు అధ్యాపకులుగా కన్వర్షన్ చేసేవారని, 2014 తరువాత ఎవరినీ కన్వర్షన్ చేయలేదన్నారు. కాంట్రాక్టు అధ్యాపకులుగా కన్వర్షన్, రెమ్యునరేషన్ పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం బాధ్యులు డాక్టర్ సంజీవ్, డాక్టర్ కుమార్, డాక్టర్ శంకర్, ఉప్పయ్య తదితరులు పాల్గొన్నారు.

