నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): విద్యతోనే అత్యుత్తమ స్థానాలను దక్కించుకోవచ్చని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్, సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత పేర్కొన్నారు. పదవ తరగతి, ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన కురుబ, కురుమ, కురువ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడంతోపాటు, వారికి నగదు, బ్యాగులు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ అత్యుత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులకు కుల సంఘాలు బాసటగా నిలవడం అభినందనీయమన్నారు. బీసీ గురుకులాలు, హాస్టల్లో నిరంతరం విద్యుత్తుకు ఇన్వర్టర్లను అమర్చుతున్నామని చెప్పారు. క్రీడలకు ప్రోత్సాహం ఇచ్చేలా స్పోర్ట్స్ కిట్లు అందజేయనున్నట్లు వివరించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఎయిమ్స్లో మహిళ అదృశ్యం
తాడేపల్లి రూరల్: పట్టణ పరిధిలోని ఎయిమ్స్లో రోగికి సహాయకురాలిగా వచ్చిన మహిళ అదృశ్యమైంది. ఈ మేరకు రోగి పి.శ్రీలక్ష్మి శనివారం మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. బాపట్ల జిల్లా చినగంజాంకు చెందిన శ్రీలక్ష్మి వైద్య నిమిత్తం ఎయిమ్స్కు వస్తూ తన బంధువైన మహాలక్ష్మిని సహాయకురాలిగా వెంట తెచ్చుకుంది. మతి స్థిమితం లేకపోవడంతో మహాలక్ష్మి ఈ నెల 29వ తేదీన అదృశ్యమైందని ఫిర్యాదులో పేర్కొంది. వివరాలకు 7995201371, 8074102715 సంప్రదించాలని కోరారు.


