జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ
గుంటూరు వెస్ట్: ముందు బుక్ చేసిన వారికి ముందు సిలిండర్ డెలివరీ చేయాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. జిల్లాలో ఎల్.పి.జి సేల్స్ ఆఫీసర్స్, గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్లుతో సోమవారం వీడియో కాన్ఫరెనన్స్లో జేసీ మాట్లాడుతూ ఎక్కువ పెండెన్సీ ఉన్న ఏజెన్సీలు అదనపు లోడ్స్ తెప్పించాలని సేల్స్ ఆఫీసర్స్కు సూచించారు. గ్యాస్ ఏజెన్సీలు ఖచ్చితంగా డోర్ డెలివరీ మాత్రమే చేయాలనని, ముందు బుక్ చేసుకున్నవారికి ముందు పంపిణీ చేసే పద్ధతిని పాటించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో డెలివరీ బాయ్స్ను ఎక్కువ ట్రిప్పులు తిరిగి అధిక సంఖ్యలో పంపిణీ చేయాలని తెలిపారు. మార్చి నెలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐ.వి.ఆర్.ఎస్ సర్వేలో దీపం పథకానికి జిల్లా మొదటి స్థానం సాధించిందని అందరినీ అభినందించారు. ఇకపై కూడా ఇదే పనితీరును కనబరచాలని అన్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ, తహసీల్దార్లు పాల్గొన్నారు.
కొండపాటూరుకు ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు
పట్నంబజారు: కొండపాటూరు అమ్మవారి ఉత్సవాలు పురస్కరించుకుని ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం డి.సాంబ్రాజ్యం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 7న ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం కొండపాటూరులో వేంచేసియున్న పోలేరమ్మ తిరునాళ్ల మహోత్సవానికి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 7వ తేదీ ఉదయం 5 నుంచి ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సును ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు. ఈ బస్సుల్లో గుంటూరు డిపో–1 నుంచి పొన్నూరు నుంచి 20 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. పెద్దలకు గుంటూరు డిపో–1 నుంచి రూ.55, పిల్లలకు రూ.30 ప్రయాణ చార్జీగా నిర్ణయించినట్లు తెలిపారు. పొన్నూరు నుంచి పెద్దలకు రూ.50, పిల్లలకు రూ.30 నిర్ణయించామని తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్పెషల్ బస్సులతోపాటు, నిత్యం తిరిగే సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. మహిళలు, దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపారు.
భట్టిప్రోలు: భట్టిప్రోలు మండలంలో గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సూరేపల్లి–వేమవరం మధ్య 216–ఎ జాతీయ రహదారి సమీపంలో బహిరంగసభ నిర్వహించనున్నారు. సోమవారం బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్, బాపట్ల ఎస్పీ బి.ఉమామహేశ్వరరావు అధికారుల బృందం బహిరంగ సభ ప్రాంతాన్ని పరిశీలించారు. వీరు అధికారులకు పలు సూచనలు చేశారు. వారి వెంట రేపల్లె ఆర్డీవో బి.శ్రీదేవి, డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, వేమూరు సీఐ వీరాంజనేయులు, ఇన్చార్జి తహసీల్దార్ వి.వెంకటేశ్వర్లు ఎస్ఐ ఎం.శివయ్య తదితరులు ఉన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు సోమవారం బంగారు మంగళ సూత్రాలను కానుకగా సమర్పించారు. విజయవాడ ఆచార్యరంగానగర్కు చెందిన జి.శరత్బాబు కుటుంబం సుమారు 22 గ్రాముల బంగారంతో రూ. 4లక్షలతో తయారు చేయించిన రెండు మంగళ సూత్రాలను ఆలయ చైర్మన్ రాధాకృష్ణకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.


