చంద్రబాబు సర్కార్ వచ్చాక అంతా తిరోగమనమే తెనాలిలో భారీగా నిలిచిపోయిన అభివృద్ధి పనులు ఏకంగా 214 పనులను రద్దు చేసేందుకు తాజాగా చర్యలు జనరల్ ఫండ్ కింద మంజూరైనపనులన్నీ రద్దు
కాంట్రాక్టర్లకు నోటీసులు ఇస్తున్నాం
చంద్రబాబు పాలనలో తెనాలి
పట్టణంలో అభివృద్ధి జాడే కనిపించడం లేదు. నిధుల లేమి కారణంగా ఇప్పటికే ప్రతిపాదించిన పనులను కూడా రద్దు చేస్తున్నారు. గతంలో చేసిన పనులకు సంబంధించి బిల్లుల అప్లోడ్, బిల్లుల చెల్లింపులో పాలకుల నిర్లక్ష్యం
కారణంగా ప్రగతి మచ్చుకైనా లేదు. ఇదే కోవలో మున్సిపల్ కౌన్సిల్లో జనరల్ ఫండ్ కింద మంజూరు చేసిన పనులలో ప్రారంభం కాని వాటిని రద్దు చేసేందుకు అఽధికారులు సిద్ధమయ్యారు. కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించారు. సమస్యలను పరిష్కరించి ప్రగతిని పట్టాలెక్కించాల్సిందిపోయి పనులనే రద్దు చేస్తున్న సర్కారు తీరుపై తెనాలి వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం
చేస్తున్నారు.
తెనాలి అర్బన్: తెనాలి పట్టణం 16.77 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీనిలో 55,917 నివాస గృహాలున్నాయి. 2.60 లక్షల జనాభాతో జిల్లాలోనే ఏకై క సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా పేరుగాంచింది. ప్రతి ఏడాది వివిధ పన్నులు, షాపుల అద్దెలు వంటి వాటి ద్వారా రూ.36 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఇవి కాకుండా 15వ ఆర్థిక సంఘం, ఇతర ప్రత్యేక గ్రాంట్ల ద్వారా సుమారు రూ.70 కోట్ల వరకు సమకూరుతుంటాయి.
రద్దు కానున్న 214 పనులు
అభివృద్ధి పనులు చేసేందుకు మున్సిపల్ సాధారణ నిధులతో పాటు వివిధ ఆర్థిక సంఘ నిధులు, ప్రత్యేక నిధులను ఉపయోగిస్తుంటారు. అయితే జనరల్ ఫండ్ కింద తెనాలి పట్టణంలో గత రెండు సంత్సరాలలో 500 పనులుకు టెండర్లు పిలిచారు. వాటిలో కొన్నింటిని పూర్తి చేయగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. అసలు ప్రారంభానికి నోచుకుని పనులు 107 ఉన్నాయి. వాటి విలువ రూ.11.69 కోట్లు, అలాగే అగ్రిమెంట్ దశలో ఉన్నవి 44 ఉన్నాయి. వాటి విలువ రూ.5.67 కోట్లు, టెండర్లలో కాంట్రాక్టర్లు పాల్గొనని పనులు 63 ఉన్నాయి. వీటి విలువ రూ.6.01 కోట్లు. వీటన్నింటిని రద్దు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల మున్సిపల్ అఽధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. అంతేకాకుండా సాధారణ నిధుల కొరత ఉన్నప్పుడు ఎందుకు టెండర్లు పిలుస్తున్నారని ప్రశ్నించారు. దీంతో అధికారులు పనులు ప్రారంభించని, టెండర్లు దక్కించుకుని అగ్రిమెంట్ చేసుకోని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా డిపాజిట్ నగదును మున్సిపల్ బ్యాంకు ఖాతాలో జమ చేయాలనే భావనలో ఉన్నట్లు సమాచారం. దీనివల్ల తెనాలి పట్టణంలో సుమారు రూ.24 కోట్ల విలువ చేసే 214 అభివృద్ధి పనులు రద్దు కానున్నాయి.
నిధుల లేమి.. బిల్లుల చెల్లింపులోజాప్యం
జిల్లాలో ఏకై క సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న తెనాలిని నిధుల కొరత వేధిస్తోంది. వివిధ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలకు, ఇతర అత్యవసర పనులకు ఉపయోగించటం వల్ల ప్రతి నెలా ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంది. కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేసిన వెంటనే కంప్యూటర్ ఆపరేటర్లు బిల్లులు తయారు చేసి నిధి యాప్లో పొందుపరచటం లేదు. కాంట్రాక్టర్లు వారి చుట్టూ ప్రదక్షిణలు చేయలేక టెండర్లను బహిష్కరిస్తూ వస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కూడా కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లింపులు జరపకపోవటంతో పనులు చేసేందుకు ముందుకు రావటం లేదు. టెండర్లు దక్కించుకున్నాక వాటిని ప్రారంభించకుండా వదిలేయటం తెనాలిలో పరిపాటిగా మారింది. తెనాలిలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతోంది. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి బిల్లుల తయారు చేయటంలో నెలకొన్న జాప్యాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
మున్సిపల్ సాధారణ నిధుల కింద గతంలో మంజూరై పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇస్తున్నాం. వారి వివరణ సంతృప్తికరంగా లేకపోతే డిపాజిట్లను మున్సిపాలిటీకి జమ చేస్తాం. అలాగే ఆ పనులన్నింటినీ రద్దు కూడా చేయనున్నాం. నిధుల కొరత కారణంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక నుంచి జనరల్ ఫండ్ కింద అభివృద్ధి పనులు కొంత కాలం నిలిపివేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
–జేఆర్ అప్పలనాయుడు,
కమిషనర్, తెనాలి పురపాలక సంఘం


