అమరావతి: దక్షిణ కాశీ క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన అమరావతిలోని కోదండ రామ ఆలయంలో వేంచేసియున్న సీతాసమేత కోదండ రామ స్వామికి శుక్రవారం శ్రీరామ నవమి సందర్భంగా వైభవంగా కల్యాణం నిర్వహించారు. స్వామి వారిని తొలుత దేవాలయంలో ప్రత్యేకంగా అలంకరించిన మండపంపై ఉంచి కల్యాణం నిర్వహించారు. ఆలయ అర్చక స్వామి పరాశరం రామకృష్ణమా చార్యులు ఆధ్వర్యంలో వైఖానస ఆగమానుసారం వేడుక జరిపించారు.
సత్తెనపల్లి: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యూయేషన్ సెంటర్లో కనీస సౌకర్యాలు లేవంటూ అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష పేపర్లు దిద్దేందుకు కనీసం కూర్చునేలా కూడా బల్లలు సరిపడా లేవని, భోజనాలు చేయటానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం శ్రీరామ నవమి పర్వదినం కావడంతో కొందరు ముందస్తుగా బయటకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో బయట గేటుకు తాళాలు వేయడంతో అధ్యాపకులు గేట్ వద్దకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పరీక్ష కేంద్ర పర్యవేక్షకుడితో కొందరు అధ్యాపకులు వాగ్వివాదానికి దిగారు.
గుంటూరు వెస్ట్: జిల్లా లోని 16 మండలాల్లో శనివారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించిందని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వడగాల్పులకు గురి కాకూడదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పనులు ఉంటే మినహా ఎవరూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పనులకు బయటకు వస్తే గొడుగు ఉపయోగించాలని, వదులు దుస్తులు ధరించాలని, తగినంత నీటిని తాగాలని సూచించారు. చిన్నారులు, వయసు మీరినవారు బయటకు వెళ్లకుండా కుటుంబ సభ్యులు చూడాలని చెప్పారు. డీ హైడ్రేషన్కు గురికాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధింత అధికారులు ప్రజలకు తగు సూచనలు, సలహాలు అందించాలని ఆదేశించారు.
ప్రకృతి సాగును పరిశీలించిన నేపాల్ బృందం
కొరిటెపాడు(గుంటూరు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రైతు సాధికార సంస్థ (ఆర్వైఎస్ఎస్) సంయుక్తంగా వ్యవసాయ శాఖ ద్వారా నిర్వహిస్తున్న ‘ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం‘ (ఏపీసీఎన్ఎఫ్) పద్ధతులను నేపాల్ బృందం పరిశీలించింది. శుక్రవారం గుంటూరులోని రైతు సాధికార సంస్థ రాష్ట్ర కార్యాలయంలో ఆ సంస్థ సీఈఓ రామారావు సదరు బృందంతో సమావేశమయ్యారు. ఆర్వైఎస్ఎస్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయ్ కుమార్ వర్చువల్గా ప్రకృతి వ్యవసాయంలో అనుసరిస్తున్న విధానాలు, రైతులకు అందుతున్న ప్రోత్సాహం, పరస్పర సహకారం, భవిష్యత్తులో ఈ రంగంలో చేపట్టాల్సిన కార్యాచరణ వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఈ బృందం కొల్లిపర మండలం, అత్తట గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించింది. క్షేత్రస్థాయిలో సాగు పద్ధతులను ప్రత్యక్షంగా పరిశీలించింది. రైతు సాధికార సంస్థకు చెందిన కృష్ణారావు, ఎన్ఆర్ఓ యూనిట్ ఆధ్వర్యంలో పర్యటన కొనసాగుతోంది.


