కాలుదువ్వితే బహుమతి కొట్టేస్తాయి!
నాదెండ్ల: ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీల్లో పల్నాడు జిల్లా ఎడ్ల జత తెలంగాణలోనూ సత్తాచాటాయి. మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మేళ్ళచెరువులో ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. బుధవారం న్యూకేటగిరి విభాగంలో జరిగిన పోటీల్లో 13 ఎడ్ల జతలు పాల్గొనగా, పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామ సర్పంచ్ మంగు రమాదేవి ఎడ్ల జత 5,367 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానం కై వసం చేసుకున్నాయి. ఎడ్ల యజమానులు రమాదేవి, ఏడుకొండలు రూ.90 వేలు నగదు, షీల్డును నిర్వాహకుల నుండి అందుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ జరిగిన పోటీల్లో పాల్గొన్న ప్రతిసారి ప్రథమస్థానం సాధిస్తూ విజయపరంపర కొనసాగించింది. ఇప్పటి వరకూ రెంటచింతల, దుర్గి, నాదెండ్లలో జరిగిన పోటీల్లో న్యూకేటగిరి విభాగంలో ప్రథమస్థానంలో నిలిచాయి. గురువారం తెలంగాణ మంచిర్యాలలో జరుగుతున్న న్యూకేటగిరి విభాగంలో పాల్గొననున్నాయి.
తెలంగాణలో బలంచూపిన పల్నాడు ఎడ్లజత


