రెవెన్యూ ఉద్యోగుల వింత లీలలు
ప్రజల సొమ్ము దోచుకుంటున్న వైనం రూ.6,44,875 లక్షలు స్వాహా చేసిన ఆర్ఐ సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్న అధికారులు నగర పాలక సంస్థ రెవెన్యూ సెక్షన్లో మాయాజాలం
రెవెన్యూ సిబ్బంది పాత్రపై అనుమానాలు
నెహ్రూనగర్: గుంటూరు నగర పాలక సంస్థలోని రెవెన్యూ విభాగంలో పనిచేసే ఉద్యోగులు ప్రజల ద్వారా వచ్చే ఆదాయాన్ని తమ జేబుల్లో వేసుకుని దర్జాగా బతికేస్తున్నారు. ఏదైనా విషయం బయటకు వస్తేనే తప్ప..లేకపోతే అంతా గుట్టుచప్పుడు కాకుండా సర్దుబాటు చేస్తున్నారు.
లక్షలు దిగమింగిన ఆర్ఐ
గాంధీ పార్కును 2023వ సంవత్సరలో ఆధునికీకరించారు. పార్కులో ప్రవేశానికి చిన్నారులకు రూ.10, పెద్దలకు రూ.25 వసూలు చేస్తున్నారు. ప్రతి రోజూ వందల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. సెలవు రోజులు, ఆదివారాల్లో పార్కు కిక్కిరిసిపోతుంది. గాంధీ పార్కు ద్వారా ప్రతి నెల లక్షల్లో ఆదాయం వస్తుంటుంది. రోజు వారీ కలెక్షన్స్ టికెట్ కౌంటర్ సిబ్బంది, ఆర్ఐ ఎప్పటికప్పుడు నగరపాలక సంస్థ క్యాష్ కౌంటర్లో జమ చేసి రశీదును ఏ–2 గుమస్తాకు అందజేయాల్సి ఉంటుంది. కానీ రోజువారీ కలెక్షన్స్ ఎప్పటికప్పుడు జమ చేయకుండా నామామాత్రంగా జమ చేసి మిగిలిన సొమ్ము తన సొంతానికి వాడుకున్నట్లు ఆరోపణలు వచ్చా యి. దీని విచారణ జరిపిన అధికారులు రూ.6,44,875 లక్షలు వాడుకుంటున్నట్లు తేల్చారు.
గతంలో చెక్కుల పేరుతో దోపిడీ
కొద్ది నెలల కిందట షాపు లీజుదారులు ఇచ్చిన చెక్కులను సకాలంలో పోస్టింగ్ వేయకుండా కార్పొరేషన్ ఆదాయానికి గండికొట్టే ప్రయత్నం చేశారు. నగరపాలక సంస్థ పరిధిలో ఏదైనా షాపు లీజుకు తీసుకోవాలంటే వేలం పాటలో పాల్గొని షాపును దక్కించుకుంటే దానికి సంబంధించి మూడు నెలల అడ్వాన్న్స్లు, ఇతర చెల్లింపులు జరిపిన తరువాత షాపును రెవెన్యూ అధికారులు కేటాయిస్తారు. అయితే మూడు నెలలపాటు షాపు అద్దె చెల్లించకపోతే ముందుగా తీసుకున్న అడ్వాన్న్స్లను సిస్టం ఆటోమెటిక్గా కట్ చేసుకుంటుంది. మూడు నెలల తరువాత నుంచి అద్దెకు సంబంధించి బకాయి రైజ్ అవుతుంది. ఆ నెల కూడా అద్దె చెల్లించకపోతే ప్రతి నెలా 10వ తేదీ తరువాత వందకు రెండు రూపాయల వడ్డీతో అద్దెకు యాడ్ అయి వస్తుంది. కొంత మంది లీజుదారులు అద్దె బకాయిలకు సంబంధించి చెక్కులను సకాలంలో ఇచ్చినప్పటి వాటిని సకాలంలో అధికారికంగా పోస్టింగ్ చేయకుండా పక్కన పెడుతుంటారు. తీరా లీజు గడువు పూర్తయ్యే సరికి బకాయి రసీదు లీజుదారుడికి అందజేస్తున్నారు. వడ్డీ చెల్లింపులు లక్షల్లో ఉండటంతో దానిని మాఫీ చేస్తామంటూ డబ్బులు గుంజుతున్నారు. రెవెన్యూ అధికారులు సిస్టంలోని లోసుగులు ఆసరాగా చేసుకుని సదరు వడ్డీని మాఫీ చేశారని ఆరోపణలు ఉన్నాయి.
గాంధీ పార్క్లో టికెట్ కౌంటర్ నగదు స్వాహా విషయంలో రెవెన్యూ విభాగం సిబ్బంది పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్కు సిబ్బంది నుంచి వసూలు చేసిన నగదుని నగర పాలక సంస్థ ట్రెజరీకి చెల్లించకుండా రూ.6,44,875 లక్షలు వాడుకున్నారని తేల్చిన అధికారులు ఆర్ఐని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు నగరపాలక సంస్థకు జమ కాకుండా ఉండకపోవడంపై రెవెన్యూ సిబ్బంది పాత్ర కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరపాలక సంస్థకు చెందిన షాపులు, మార్కెట్లు, టాయిలెట్లు ఎవరైన వేలం పాటలో పాడుకుంటే సంబంధిత సిబ్బంది ద్వారా వసూలు చేయాల్సిన బాధ్యత రెవెన్యూ సెక్షన్ ఏ–2 2 గుమస్తాది. ప్రతి నెలా వచ్చే రాబడి, రోజు వారీ కలెక్షన్స్ ఆయా సిబ్బంది ద్వారా తెప్పించుకుని రికార్డ్ చేయాల్సిన బాధ్యత సదరు గుమస్తాది. కానీ రూ.6,44,875 లక్షలు నగరపాలక సంస్థకు జమ కాకుండా ఉన్నాయంటే సదరు గుమస్తా ఏం చేస్తున్నారో అని సిబ్బందే సందేహం వ్యక్తం చేస్తున్నారు. సెక్షన్ సూపరింటెండెంట్ ఏం చేస్తున్నారని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. డబ్బులు వాడుకున్న వ్యవహారంలో రెవెన్యూ సిబ్బంది పాత్ర లేకుండా ఉండదని పలువురు ఆరోపిస్తున్నారు.


