వంగిపురం బీఎఫ్ఎస్ మోడల్ పాఠశాల పరిశీలన
ప్రత్తిపాడు: గుంటూరు జిల్లా వంగిపురం బీఎఫ్ఎస్ మోడల్ పాఠశాలను మండల విద్యాశాఖాధికారి సీహెచ్. రమాదేవి పరిశీలించారు. పాఠశాలలోని ఒక గది పల్లపు ప్రాంతంలో, మరొక గది మెరకలో ఉండటంతో చిన్నపాటి వర్షాలకు సైతం గదుల్లోకి నీరు చేరుతుందని, మోటార్లతో నీటిని బయటకు పంపుకోవాల్సిన దుస్థితి చోటు చేసుకుందంటూ సోమవారం ‘సాక్షి’లో ‘మో’డల్’బడి..హడలే మరి’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో ఎంఈవో పాఠశాలను తనిఖీ చేశారు. నివేదికను జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తెలిపారు.
మల్లికార్జున స్వామికి ప్రత్యేక హారతులు
గుంటూరుఎడ్యుకేషన్: గుంటూరు మల్లికార్జునపేటలోని శ్రీగంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారి దేవస్థానంలో కార్తిక సోమవారాన్ని పురస్కరించుకుని స్వామివారు, అమ్మవారు విశేష అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం స్వామి వారికి ఆలయన ప్రధాన అర్చక స్వామి చంద్రశేఖర శర్మ 11 రకాల ప్రత్యేక హారతులు ఇచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించి, దీపాలు వెలిగించారు.
పత్తి కొనుగోలుకు పల్నాడులో 11 కేంద్రాలు
నరసరావుపేట: ప్రభుత్వం పత్తి కొనుగోలులో రైతులు పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాలకు సంబంధించిన వాల్పోస్టర్, కరపత్రాలను కలెక్టర్ కృతికా శుక్లా సోమవారం ఆవిష్కరించారు. భారత కాటన్ కార్పొరేషన్ (సీసీఐ) ద్వారా జిల్లాలో 11 జిన్నింగ్ మిల్లుల్లో త్వరలో కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేయటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, డీఆర్ఓ ఏకా మురళి, ఆర్డీఓ కె.మధులత, జిల్లా వ్యవసాయాధికారి కె.జగ్గారావు, జిల్లా అగ్రిట్రేడ్ మార్కెటింగ్ అధికారి కేవీఎన్ ఉపేంద్రకుమార్ పాల్గొన్నారు.
డబుల్ రోడ్డు పనులు పూర్తయితే మంచిదే
అమరావతి: వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.149 కోట్ల నాబార్డ్ నిధులతో ప్రారంభించిన అమరావతి–బెల్లంకొండ డబుల్ రోడ్డు మిగిలిన పనులు ఏడాదిన్నర తరువాత ప్రారంభించటం మంచిదేనని పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నా రు. సోమవారం మల్లాది–జూపూడి గ్రామాల మధ్య డబుల్ రోడ్డు పనులు పరిశీలించి మాట్లాడారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 70 కల్వర్ట్లు, రోడ్డు విస్తరణ, పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు నిర్మించడం జరిగిందన్నారు. ఏడాదిన్నర తర్వాత కాంట్రాక్టర్కు రావలసిన బిల్లులు విడుదల చేయడంతో మళ్లీ రోడ్డు పనులు ప్రారంభించారన్నారు.
పాలువాయి రైల్వేగేటు మూసివేత
రెంటచింతల: మాచర్ల– నడికుడి రైల్వే జంక్షన్ పరిధిలోని పాలువాయి రైల్వే గేటును రెండు రోజులపాటు మూసి వేస్తున్నట్లు నడికుడి సీనియర్ సెక్టర్ ఇంజినీర్ రాజేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలువాయి రైల్వేగేటు పరిధిలో ట్రాక్ మరమ్మతుల నిమిత్తం మంగళ, బుధవారాలు గేటు మూసి వేస్తున్నట్లు వెల్లడించారు. మాచర్ల–గుంటూరు రోడ్డు మార్గంలో ప్రయాణించే ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు, పరిసర ప్రాంతాల ప్రజలు ఈ రెండు రోజుల పాటు ప్రత్యామ్నాయ రహదారులలో ప్రయాణం చేయాలని ఆయన కోరారు. ఈ మార్గంలో మాచర్ల–గుంటూరు ప్యాసింజర్ రైలు యథావిధిగా నడుస్తుందన్నారు.
వంగిపురం బీఎఫ్ఎస్ మోడల్ పాఠశాల పరిశీలన
వంగిపురం బీఎఫ్ఎస్ మోడల్ పాఠశాల పరిశీలన
వంగిపురం బీఎఫ్ఎస్ మోడల్ పాఠశాల పరిశీలన
వంగిపురం బీఎఫ్ఎస్ మోడల్ పాఠశాల పరిశీలన


