
సీ్త్రనిధి.. హతవిధి!
సీ్త్రనిధి రుణాల రికవరీపై వెలుగు అధికారుల నిర్లక్ష్యం రూ.1.23 కోట్ల ‘ఎన్పీఏ’తో కొత్త రుణాలు కరువు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక్కరికీ దొరకని అప్పు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పేద మహిళలు మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయిస్తున్న డ్వాక్రా సభ్యులు
ప్రత్తిపాడు మండలంలో సీ్త్ర నిధి రుణాల ప్రక్రియ ప్రహసనంగా మారింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 9 కోట్ల రుణాల మంజూరుకు అవకాశం ఉన్నప్పటికీ, పాత బకాయిలు ఎన్పీఏలోకి వెళ్లడంతో నూతనంగా ఇవ్వలేని పరిస్థితి చోటుచేసుకుంది. మహిళలు మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆ అప్పులకు వడ్డీలు అధికంగా చెల్లిస్తూ రుణాల ఊబిలో కూరుకుపోతున్నారు.
ప్రత్తిపాడు: మండలంలో 2022–23, 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి 4,441 మంది మహిళలకు రూ. 23 కోట్ల మేర సీ్త్ర నిధి రుణాలిచ్చారు. ప్రస్తుతం అప్పు నిల్వ రూ. 4.84 కోట్లు ఉండగా, బకాయిలు రూ. 76.09 లక్షలు ఉన్నాయి. కాగా రూ. 57.68 లక్షలు ఎన్పీఏ కిందకు చేరాయి. మొత్తం మీద ప్రస్తుతం రూ. 1.23 కోట్ల మేర ఎన్పీఏ ఔట్ స్టాండింగ్ ఉంది. పాతవి రికవరీ చెయ్యక.. కొత్తవి మంజూరు కాక.. సీ్త్రనిధి బకాయిల్లో ఓవర్ డ్యూ రూ. 57 లక్షలు రికవరీ అయితే గానీ కొత్త రుణాలు ఇవ్వడం సాధ్యపడదు. వెలుగు అధికారులు రికవరీపై దృష్టి సారించకపోవడంతో అప్పుల కుప్ప పెరిగిపోయి కూర్చుంది. కనీసం ఓవర్డ్యూలో సగం అయినా రికవరీ చేస్తే కొత్త వారికి సీ్త్రనిధి రుణాలు మంజూరు చేయవచ్చు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇబ్బందులే
2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 9.30 కోట్లు సీ్త్ర నిధి ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణం కింద ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యం విధించింది. కానీ ఎన్పీఏ ఔట్ స్టాండింగ్ రూ. 20 లక్షల కన్నా అధికంగా ఉంటే సీ్త్రనిధి రుణాలు ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కరంటే ఒక్కరికీ రుణం ఇవ్వని దుస్థితి చోటుచేసుకుంది. సుమారు 931 మంది మహిళలు రుణానికి అర్హులుగా ఉన్నారు. కానీ అప్పు ఇవ్వకపోవడంతో మహిళలు స్థానికంగా ఉన్న మైక్రోఫైనాన్స్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం ..
సీ్త్రనిధి రుణాల రికవరీపై వెలుగు శాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 2022–23లో ఎన్పీఏ ఔట్ స్టాండింగ్ రూ.10.52 లక్షలు, 2023–24లో రూ. 2.81లక్షలు, 2024–25లో రూ.15 లక్షల మేర ఉంది. ప్రస్తుతం ఆ మొత్తం రూ.1.23 కోట్లకు చేరిందంటే రికవరీ పట్ల అధికారుల అలసత్వం గురించి వేరే చెప్పనక్కర్లేదు.
పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా..
అంతే కాకుండా మండలానికి చెందిన ఒక గ్రామంలోని డ్వాక్రా మహిళలు తాము తీసుకున్న సీ్త్ర నిధి బకాయిలకు సంబంధించిన నగదు తమ వీవో ఖాతాలో వేశామని, ఆ మొత్తాన్ని సీ్త్రనిధి బకాయి కింద జమ చేసుకోవాలని కోరుతున్నా అధికారులు మాత్రం రకరకాల కారణాలను చూపుతూ జమ చేసుకోవడం లేదన్నారు. దీంతో సదరు ఖాతాలు ఎన్పీఏలోనికి వెళ్లిపోయాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని సంబంధిత సభ్యుల కుటుంబీకులు జిల్లా కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.
సీసీలకు మెమోలిచ్చాం
సీ్త్రనిధి రుణాల రికవరీ అంతగా లేకపోవడంతో సంబంధిత క్లస్టర్ల సీసీలకు మెమోలు కూడా ఇచ్చాం. లోన్ పాలసీ ప్రకారం రూ.20 లక్షలకుపైన ఎన్పీఏ ఉంటే మండలం ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతుంది. రూ.20 లక్షల కన్నా దిగువకు ఎన్పీఏ తగ్గితే అప్పుడు రుణాలు ఇవ్వవచ్చు. రికవరీపై పూర్తి స్థాయి దృష్టి సారించాం.
– ఎస్. హర్షవర్ధన్ ,
ఏజీఎం, సీ్త్రనిధి