
షార్ట్ హ్యాండ్ పరీక్షల షెడ్యూల్ విడుదల
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది జనవరి 4న షార్ట్ హ్యాండ్, జనవరి 25,26వ తేదీల్లో టైప్ రైటింగ్ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదలైనట్లు ఆల్ ప్రిన్సిపాల్స్ టెక్నికల్ కంప్యూటర్ ఇనిస్టిట్యూట్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు టీవీఎస్ ప్రకాష్బాబు గురువారం తెలిపారు. ఆయా పరీక్షలకు హాజరుకాబోయే అభ్యర్థులు సమీపంలోని టైప్ ఇనిస్టిట్యూట్స్లో సంప్రదించాలని ఆయన సూచించారు.
గంజాయి స్వాధీనం
పెదకాకాని: నగర శివారులోని బసవతారక రామనగర్ సమీపంలో ఇద్దరు గంజాయి తాగుతుండగా టాస్క్పోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 250 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఎర్ల వెంకటచిన్న, గుంజి మోహన్లుగా గుర్తించారు. ప్రాథమిక విచారణలో వారికి విక్రమ్ అనే వ్యక్తి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గురువారం సీఐ టి.పి. నారాయణస్వామి తెలిపారు.
రైలులో 4.4 కిలోలు..
తెనాలి రూరల్: రైలులో తరలిస్తున్న గంజాయిని తెనాలి జీఆర్పీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాటా నగర్ నుంచి ఎర్నాకులం వెళ్లే రైలులో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో జీఆర్పీ ఎస్ఐ జి. వెంకటాద్రిబాబు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. రైలు గురువారం తెనాలి చేరుకోగానే బోగీల్లో తనిఖీలు చేపట్టారు. ఎస్–3 బోగీలోని ఓ బ్యాగులో 4.4 కిలోల గంజాయిని గుర్తించి సీజ్ చేశారు. వెంటనే తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణకు సమాచారమందించి, ఆయన సమక్షంలో సీజ్ చేశారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తి పరారయ్యాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
19న ‘మట్టి రంగు’ పుస్తకావిష్కరణ
బాపట్ల: ప్రముఖ కవయిత్రి చిల్లర భవానీదేవి రచించిన ‘మట్టి రంగు’ కవితా సంపుటి ఆవిష్కరణ ఈ నెల 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్థానిక హోటల్ గౌతం వేదిక హాలులో జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం ఉంటుందని బాపట్ల జిల్లా రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు తిమ్మన శ్యామ్ సుందర్ తెలిపారు. రచయిత పాపినేని శివశంకర్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని పేర్కొన్నారు. రచయిత్రి వెలువోలు నాగరాజ్యలక్ష్మి సభాధ్యక్షత , సాహితీ విమర్శకులు బీరం సుందరరావు పుస్తక పరిచయాన్ని చేస్తారని తెలిపారు. ఆత్మీయ అతిథిగా ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డా. పి.సి. సాయిబాబు పాల్గొననున్నట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా కోటంరాజు సత్యనారాయణ శర్మ దంపతుల స్మారక సాహితీ పురస్కారాన్ని డా. అప్పాజోస్యుల సత్యనారాయణకు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.