
ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు
తురకపాలెంలో వరుస మరణాలపై వీడని మిస్టరీ ఆర్ఎంపీ క్లినిక్ను సీజ్ చేసిన అధికారులు ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యాన్ని ఆర్ఎంపీలపై నెట్టే ప్రయత్నమా ? పది రోజులుగా బ్లడ్ శాంపిల్స్ పరీక్షలు రాకపోవటంపై ప్రజల్లో అనుమానాలు బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేనా? ప్రభుత్వ నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం
గుంటూరు రూరల్: మండలంలోని తురకపాలెంలో వరుస మరణాల మిస్టరీ ఇంకా తేలలేదు. ప్రభుత్వ తాత్సారంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇటు ప్రజల్లోనూ అనేక అపోహలు నెలకొన్నాయి. బొడ్డురాయి పూజలు, గౌతు రాయిని సరి చేయడం కార్యక్రమాలను గ్రామ పెద్దలు నిర్వహించారు. అయినా, పరిస్థితిలో మార్పులేదు. గ్రామస్తులు జ్వరాలతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆరుగురు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వారం రోజులుగా చికిత్సలు పొందుతూనే ఉన్నారు.
మెలియాయిడోసీస్గా ప్రైవేటు వైద్యులు నిర్ధారణ
గ్రామంలో మెలియాయిడోసీస్తో పలువురు తమ ఆసుపత్రుల్లో చికిత్స పొందారని ప్రైవేటు వైద్యులు బాహటంగానే చెప్పారు. కొందరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నారు. గత వారం రోజలుగా గ్రామంలో రాష్ట్ర, నేషనల్ స్థాయి వైద్య బృందాలు పర్యటించి శాంపిల్స్ సేకరిస్తూనే ఉన్నాయి. గ్రామస్తుల నుంచి రక్తాన్ని తీసుకుని వెళుతున్నారే కానీ వాటి ఫలితాలను మాత్రం వెల్లడించలేదు. నేటికి వ్యాధి నిర్థారణ కాలేదనే ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు. తమ అనుమానాలను నివృత్తి చేసే ఆలోచన ప్రభుత్వానికి, వైద్యులకు ఉందా.. లేదా ? అనే సంశయమం గ్రామస్తుల్లో నెలకొంది. నిత్యం ఇదే చర్చాంశనీయంగా మారింది.
ఆర్ఎంపీపై మరణాల భారం
గ్రామంలో వరుస మరణాల్లో పలువురు సమీపంలోని ఒక ఆర్ఎంపీ వైద్యుడి వద్ద చికిత్స పొందారు. అతడు అధిక మోతాదులో యాంటీబయాటిక్స్ వినియోగిస్తూ, కలుషిత సైలెన్స్ వినియోగించటం వల్ల ఇన్ఫెక్షన్లకు గురై కొందరు మృత్యువాతకు గురైనట్లు అనుమానంతో జిల్లా వైద్యాధికారులు క్లినిక్ను సీజ్ చేశారు. అయితే, అదే ఆర్ఎంపీ వద్ద సమీప గ్రామాలకు చెందిన మల్లవరం, పెద్దపలకలూరు, చిన్నపలకలూరు, తోకావారిపాలెం, జన్మభూమినగర్ ప్రాంతాలకు చెందిన ప్రజలు చికిత్సలను పొందారు. ఆర్ఎంపీ అత్యధిక మోతాదులో మెడిసిన్ రోగులకు వినియోగిస్తే ఇతర గ్రామాల ప్రజలకు ఎందుకు ఇన్ఫెక్షన్లు సోకలేదు ? కేవలం ఆర్ఎంపీ చేసిన తప్పు వల్లే మరణాలకు గురయ్యారనటం సబబేనా? అని గ్రామాల్లో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే అనారోగ్యంతో మృత్యువాతకు గురైన వారిలో ఇతర ఆసుపత్రుల్లో చికిత్సలు పొందినవారు ఉన్నారు. మరి ఆయా ఆసుపత్రులను వదిలి, ఆర్ఎంపీ క్లినిక్పైనే చర్యలు తీసుకోవటం ఏంటి? ఇంకా ఆ గ్రామం సమీప గ్రామాల్లో ఆర్ఎంపీలు లేరా? అనే విషయాలపై గ్రామస్తులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.
బయటకురాని రక్త పరీక్షల వివరాలు
గ్రామంలో రాష్ట్ర, జాతీయ స్థాయి సంస్థలు పలు బృందాలుగా గ్రామంలో జ్వర పీడితుల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించాయి. వాటి ఫలితాలు నేటికి తెలియకపోవటం శోచనీయం. పది రోజులుగా గ్రామంలో మెడికల్ క్యాంపులు జరుగుతూనే ఉన్నాయి. వరుస మరణాలకు కారణం ఏంటని రాష్ట్ర ప్రభుత్వం కానీ, వైద్యా ఆరోగ్యశాఖ కానీ నేటికీ నిర్ధారించకపోవటం గ్రామ ప్రజల్లో పలు ఆలోచనలను రేకెత్తిస్తోంది.
మెడికల్ క్యాంపులో
పరీక్షలు చేయించుకుంటున్న ప్రజలు
బాధితులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో లక్షల రూపాయల అప్పులు చేసి తమ కుటుంబ సభ్యులను బతికించుకునే ప్రయత్నం చేశారు. డబ్బులు పోగా అనారోగ్యాలకు గురైనవారిని కోల్పోయారు. ప్రతి ఇంటిలో పెద్దను కోల్పోయి, నేడు ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడుతున్నారు. బాధిత కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వం నేటికి ఆర్థిక సాయం ప్రకటించలేకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా ఆదుకోవాలని కోరుతున్నారు.

ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు