
ఎక్స్లో లోకేష్ స్పందన... పోలీసుల అత్యుత్సాహం
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): చేసిన సహాయాన్ని మరిచి అధికారం ఉందని జోజిబాబు అనే వ్యక్తి ‘వైఎస్సార్సీపీ నాయకుడు నా కారు తీసుకుని ఇవ్వడం లేదని, నగరంపాలెం పోలీసులు పట్టించుకోవడం లేదని’ ఎక్స్లో చేసిన పోస్టుకు మంత్రి లోకేష్ స్పందించారు. ఆయన స్పందనతో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి కారును స్వాధీనం చేసుకున్న ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఈ మేరకు బాధితుడు తన గోడు వెళ్లబోసుకున్నారు. శ్రీనివాసరావుపేటకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్కుమార్ వద్దకు కారంపూడి ప్రాంతానికి చెందిన జోజి బాబు అనే వ్యక్తి గతంలో వచ్చారు. తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కారును సబ్సిడీపై జోజిబాబు తీసుకున్నారు. ఆ తరువాత మంగళగిరికి చెందిన పున్నా రామచంద్రరావుకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇచ్చారు. మూడేళ్లయినా వాహనం అప్పగించకపోగా, డబ్బులు కూడా చెల్లించడం లేదంటూ 2022లో జోజి బాబు వాపోతూ ప్రేమ్కుమార్ సాయం కోరారు. ఎలాగైనా కారు ఇప్పించాలని ప్రాథేయపడ్డారు. దీంతో పున్నా రామచంద్రరావు వద్దకు ప్రేమ్కుమార్ వెళ్లి నిలదీశారు. రూ.8 లక్షలకు కారును జోజిబాబు తాకట్టు పెట్టారని, డబ్బు ఇచ్చి కారు తీసుకెళ్లాలని రామచంద్రరావు చెప్పారు. దీంతో ప్రేమ్కుమార్... ఆ సమయంలో నగరంపాలెం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సీఐ హైమారావును కలిసి జోజిబాబు చేత ఫిర్యాదు చేయించారు. దీంతో సీఐ దర్యాప్తు చేపట్టారు. మంగళగిరికి చెందిన పున్నా రామచంద్రరావును స్టేషన్కు పిలిపించారు. కారు ఇవ్వాల్సిందిగా సూచించారు. కానీ తమకు ఇవ్వాల్సిన రూ.8 లక్షలు చెల్లించాలని రామచంద్రరావుకు మధ్యవర్తిగా వచ్చిన అద్దంకి ప్రాంతానికి చెందిన రాజ్కుమార్ పేర్కొనగా.... అంత ఇవ్వలేనని జోజిబాబు చెప్పారు. ప్రేమ్కుమార్ను బతిమిలాడి ఎలాగైనా కారు ఇప్పించాలని కోరారు. ప్రేమ్కుమార్ వద్ద ఉన్న స్కార్పియో కారును విక్రయించి, దాని ద్వారా వచ్చిన రూ.5 లక్షలు పున్నా రామచంద్రరావుకు చెల్లించారు. ఆ కారుకు సంబంధించి 2022 జూన్ 30వ తేదీన జోజిబాబు చేత రూ.50 స్టాంప్ పేపర్ మీద షరతులతో కూడిన అంగీకార పత్రాన్ని రాయించుకుని కారును ప్రేమ్కుమార్ తన అవసరాలకు వినియోగించుకుంటున్నారు. 2022 నుంచి జోజిబాబు అడిగినప్పుడల్లా ఎంతో కొంత నగదు ఇస్తూ స్నేహంగా ఉన్నారు. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు ఆరు నెలల కిత్రం జోజిబాబు కారంపూడి పోలీస్ స్టేషన్లో కారు తీసుకుని ప్రేమ్కుమార్ తిరిగి ఇవ్వడం లేదని చెప్పారు. పోలీసులు వెంటనే ప్రేమ్కుమార్ను పిలిపించారు. జరిగిన విషయాన్ని ఆయన పోలీసులకు తెలిపారు. మళ్లీ మూడు నెలల క్రితం నగరంపాలెం పోలీస్ స్టేషన్లో జోజిబాబు ఫిర్యాదు చేయగా, ప్రేమ్కుమార్ను పిలిచి మాట్లాడారు. జోజిబాబు నుంచి రూ.5 లక్షలు ఇప్పించాలని, తాను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని ప్రేమ్కుమార్ చెప్పారు.
పై నుంచి ఆదేశాలు ఉన్నాయంటూ బాధితుడికి బెదిరింపులు
కారు ఇచ్చి వెళ్లాలని వైఎస్సార్సీపీ నేతకు హుకుం జారీ చేసిన అధికారులు
లేని పక్షంలో కేసులు బనాయించి రౌడీషీట్ తెరుస్తామని ఎస్సై హెచ్చరిక
దిక్కుతోచక కారును పోలీసులకు అప్పగించిన వైఎస్సార్సీపీ నేత
సాయం చేయడానికి వెళ్లినందుకు ఆర్థికంగా నష్టపోయిన వైనం