
రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్
గుంటూరు మెడికల్: మొదటి నుంచి రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు సామాజిక న్యాయాన్ని చిన్నచూపు చూస్తూ తమ అనుంగ మిత్రుల లాభార్జనకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ రతన్లాల్ తెలిపారు. స్థానిక బ్రాడీపేటలోని జాషువా విజ్ఞాన కేంద్రంలో ఆదివారం బి.పి. మండల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు అధ్యక్షతన ‘భారత రాజ్యాంగం, సామాజిక న్యాయం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ప్రొఫెసర్ రతన్లాల్ మాట్లాడుతూ రాజ్యాంగంలో చెప్పిన
సామ్యవాద, లౌకిక వాద ఆలోచనలను వ్యతిరేకిస్తూ, దాని స్థానంలో మను ధర్మ శాస్త్రం ఉండాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగాన్ని చిత్తశుద్ధితో అమలు చేసిన కాంగ్రెస్ ద్వారానే బహుజనులకు సామాజిక న్యాయం అందుతుందని చెప్పారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ పేరుతో పనిచేస్తున్న అనేక పార్టీలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనువాదులతో కలిసి దళితులకు ద్రోహం చేస్తున్నాయని విమర్శించారు. దళిత బహుజనులను అభివృద్ధిలో భాగం చేసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నేడు బహుజనులు అందరి పైనా ఉందని తెలిపారు. దేశంలో ప్రతి పౌరునికీ స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమాన అవకాశాలు అందేలా ప్రభుత్వాలు నడవాలని ఆయన సూచించారు. అనంతరం డాక్టర్ రతన్లాల్ను బి.పి. మండల్సేన అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు దుశ్శాలువతో సత్కరించారు. సమావేశానికి ముందు అమరావతి రోడ్డులోని బీసీ రిజర్వేషన్ల సాధకుడు బి.పి. మండల్ విగ్రహానికి, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్, లాడ్జి సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ డాక్టర్ రతన్లాల్