కాల్పులకూ వెనుకాడం
కాల్పులకూ వెనుకాడం సాక్షి ప్రతినిధి, గుంటూరు : గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని వాస్కోడిగామా–షాలీమార్ రైలులో అచ్యుతాంబ అనే ప్రయాణికురాలు బళ్ళారి నుంచి రాజమండ్రి వెళుతున్న సమయంలో ఆమె మెడలో ఉన్న 16 గ్రాముల బంగారు ఆభరణాన్ని దొంగ లాక్కెళ్లాడు. మంగళగిరి–కేసీపీ సిమెంట్స్ వద్ద రైలు మలుపు తిరిగే ప్రదేశంలో దోచుకుని పారిపోయాడు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. అలాగే భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ రైలు మంగళగిరి– కేసీపీ సిమెంట్స్ వద్ద మలుపు తిరిగే సమయంలో లలితా బెహరా అనే ప్రయాణికురాలి బ్యాగ్ను కూడా దొంగ లాక్కెళ్లాడు. ఈ ఘటన కూడా శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. బ్యాగ్లో 25 గ్రాముల బంగారు వస్తువులు ఉన్నట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు. రైల్వే జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఒకే ప్రదేశంలో రెండు వేరు వేరు రైళ్లలో దొంగతనాలు చేసిన వ్యక్తి ఒక్కరే కావచ్చని అనుమానిస్తున్నారు. మంగళగిరి రైల్వే స్టేషన్ పరిధిలో దొంగతనానికి పాల్పడే యత్నం చేస్తున్న విషయాన్ని గమనించిన రైల్వే పోలీసులు అప్రమత్తం కావడంతో చోరీ చేసే వ్యక్తి పరారీ అయ్యాడు.
గతంలోనూ పలు ఘటనలు
15 రోజుల క్రితం ఇదే తరహాలో దొంగతనాలు జరిగాయి. తాడేపల్లి, మంగళగిరి మధ్య దొంగతనాలు ఎక్కువగా జరగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది జూన్ 29న నాగర్సోల్–నరసాపూర్ రైలులో తుమ్మలచెరువు వద్ద దోపిడీకి పాల్పడిన వారిపై రైల్వే పోలీసులు కాల్పులు జరపడంతో పరారయ్యారు. ఈ ఏడాది జూన్ 27న న్యూ పిడుగురాళ్ళ, జూన్ 23న తుమ్మల చెరువు, ఈ నెల 25న నడికుడి స్టేషన్ల వద్ద సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి మరీ బంగారం, ఇతర విలువైన వస్తువులను దొంగలు దోచుకెళ్లారు మహారాష్ట్ర, బిహార్ ముఠాలు ఈ దోపిడీలకు పాల్పడుతున్నట్లు సమాచారం.
వేధిస్తున్న సిబ్బంది కొరత
రాత్రి పూట ప్రయాణించే రైళ్లలో కనీసం నలుగురు సాయుధ పోలీసులు ఉండాలి. కానీ, ఒకరిద్దరితో అధికారులు సరిపెడుతున్నారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఐఆర్పీ పోలీసుల పరిధిలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలు ఉన్నాయి. వీటి పరిధిలో నాలుగు రైల్వే పోలీస్ స్టేషన్లు గుంటూరు, తెనాలి, నడికుడి, నరసరావుపేట స్టేషన్లు ఉన్నాయి. వీటికిగాను గుంటూరు, తెనాలి, నడికుడి రైల్వే పోలీస్ స్టేషన్లకు ఎస్సైలు ఉండగా, నరసరావుపేట స్టేషన్కు ఎస్సై పోస్టు చాలా కాలంగా ఖాళీగా ఉంది. అయితే గుంటూరు రైల్వే డివిజన్లోని జీఆర్పీ పరిధిలో ఉండాల్సిన సిబ్బందిలో 20 శాతం, ఆర్పీఎఫ్ పరిధిలో 30 శాతం సిబ్బంది మాత్రమే ఉన్నారు. గుంటూరు డివిజన్ నుంచి సుమారు 70 రైళ్లు రాకపోకలు సాగిస్త్ను క్రమంలో వాటిలో భద్రత కల్పించేందుకు సరైన సిబ్బంది లేని దుస్థితి నెలకొంది.
అరకొరగా పనిచేస్తున్న సీసీ కెమెరాలు
కేంద్ర ప్రభుత్వం ఒక వైపు రైల్వే స్టేషన్లలో అత్యాధునిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెబుతున్నప్పటికీ కనీసం రైల్వే ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం లేదు. ప్రధానంగా గుంటూరు రైల్వే స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అరకొరగా మాత్రమే పనిచేస్తున్నాయి. మరీ ముఖ్యంగా నడికుడి, నరసరావుపేట, కృష్ణా కెనాల్, తాడేపల్లి, మంగళగిరి, నంబూరు, బాపట్ల, రేపల్లె, వంటి రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆయా ప్రాంతాలలో దొంగతనాలు చేసేందుకు దొంగలకు సులువుగా ఉంది.
రైల్వే ప్రయాణికుల భద్రత కోసం దొంగలపై తుపాకీ కాల్పులు జరపడానికి కూడా మా సిబ్బంది వెనుకాడటం లేదు. నడికుడి రైల్వే స్టేషన్లో అలారం చైన్ పుల్లింగ్ (ఏసీపీ) జరిగిన తక్షణమే పక్క బోగీలో ఉన్న రైల్వే పోలీసులు అప్రమత్తం అయ్యారు. దొంగలను పట్టుకునేందుకు వారిపై కాల్పులు కూడా జరిపారు. తర్వాత రెండు నెలలపాటు నేరాలు కొంత మేర తగ్గాయి. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ఉన్న వారితోనే నేరగాళ్లపై పూర్తి నిఘా పెడుతున్నాం. ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నాం.
● గుంటూరు డివిజన్ పరిధిలో నడికుడి
రైల్వేస్టేషన్ పరిసరాల్లో దోపిడీలు
● ఇటీవల వరుసగా మూడుసార్లు రైలు
ఆపి బంగారం దోచుకెళ్లిన దొంగలు
● సిగ్నల్ ట్యాంపరింగ్ ద్వారా
తెగబడుతున్న చోరులు
● రైల్వే అధికారుల నిర్లక్ష్యంతో
ప్రయాణికుల్లో ఆందోళన
● అదనపు భద్రతా సిబ్బందిని ఈ
మార్గంలో నియమించడంలో విఫలం
● ప్రత్యేక చర్యలు తీసుకుంటేనే
నేరాలకు అడ్డుకట్ట సాధ్యం
● తాజాగా తాడేపల్లి – మంగళగిరి
మధ్య రెండు రైళ్లలో మళ్లీ దోపిడీ
రైల్వే ప్రయాణికులకు భద్రత గాలిలో దీపంలా మారింది. రైల్వే, పోలీస్ శాఖకు దోపిడీదారులు, చోరులు సవాల్గా మారారు. రైల్వే శాఖలో సిబ్బంది కొరత ఉండటంతో నేరాలను అడ్డుకునేందుకు కనీస చర్యలు కూడా చేపట్టడం లేదు. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి ఇటీవల కాలంలో మూడు సార్లు ప్రయాణికులను దొంగలు దోచుకున్నారు. తాజాగా ఒకే రోజు రెండు రైళ్లల్లో దొంగతనాలు జరిగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు.
– పి.అక్కేశ్వరరావు,
జీఆర్పీ డీఎస్పీ, గుంటూరు రైల్వే డివిజన్