సత్తెనపల్లి: రాష్ట్రంలో ఏడాది నుంచి రాక్షస పాలన కొనసాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది రాజారపు శివనాగేశ్వరరావు ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్, బీసీ మహిళ ఉప్పాల హారిక, ఆమె భర్త రాముపై టీడీపీ గూండాలు రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడి చేయడం అమానుషమని పేర్కొన్నారు. కారును ముందుకు కదలనీయకుండా రోడ్డుపై దాడి చేయడం అప్రజాస్వామికమని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీసీ మహిళలపై దౌర్జన్యాలు, దాడులు ఎక్కువ అయ్యాయనడానికి ఇదొక ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పోకడ ఎమర్జెన్సీని తలపిస్తోందని, మహిళలకు రక్షణ లేదని తెలిపారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ గుండాలు దాడిచేయడం దారుణమని ఖండించారు. ఒక మహిళ హోం మంత్రి అయి ఉండి కూడా మహిళలకు రక్షణ లేకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఇలాంటి దాడులను కూటమి ప్రభుత్వం మానుకోవాలని, లేనిపక్షంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దాడి చేసిన టీడీపీ గుండాలను కఠినంగా శిక్షించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని శివనాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
దాచేపల్లి : రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ దేవళ్ల రేవతి అన్నారు. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడిని ఆదివారం ఆమె తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు పాలన మహిళల పాలిట నరకాసుర పాలనగా మారిందని ధ్వజమెత్తారు. మహిళలకు కనీస రక్షణ ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల మహిళా ప్రజాప్రతినిధులను మానసికంగా వేధించి, భౌతిక దాడులు చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం బరితెగించి వ్యవహరిస్తోందని రేవతి మండిపడ్డారు. మహిళా ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే సామాన్య మహిళలకు ఈ ప్రభుత్వం రక్షణ ఎక్కడ ఇస్తుందని ఆమె ప్రశ్నించారు. టీడీపీ గూండాలు హారికపై దాడి చేసి చంపేస్తామని బెదిరించడం దారుణమైన ఘటనగా పేర్కొన్నారు. దీనిపై ప్రతి ఒక్కరు స్పందించి ప్రభుత్వ తీరుని ఎండగట్టాల్సిన ఆమె పిలుపునిచ్చారు. బీసీ మహిళ అయినా హారికపై దాడికి హోంమంత్రి బాధ్యత వహించి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని రేవతి డిమాండ్ చేశారు.
జెడ్పీ చైర్పర్సన్ హారికపై దాడి అమానుషం
చిలకలూరిపేట: బీసీ మహిళా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై రాళ్లు, కర్రలతో టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడులకు పాల్పడడం అమానుషమని పల్నాడు జిల్లా వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు కందుల శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడారు. బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ సభకు వెళుతుండగా కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలో దాడికి పాల్పడడాన్ని ఖండించారు. ప్రభుత్వ తీరును సభ్య సమాజం తీవ్రంగా అసహ్యించుంకుంటున్నదని వెల్లడించారు. ప్రతిపక్షం లేకుండా చేయాలనే ప్రభుత్వ విధానం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని విమర్శించారు. ప్రభుత్వ తీరును ప్రశ్నించేవారే ఉండకూడదన్నట్లు వ్యవహరించటం ప్రజాస్వామ్య విధానాలకు పూర్తి వ్యతిరేకమని పేర్కొన్నారు. ప్రశ్నించటం, నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వంటివని, వాటిని కాలరాయాలని చూస్తే తీవ్ర ప్రజావ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. దుర్ఘటనకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో రాక్షస పాలనకు తెరతీసిన టీడీపీ నేతలు
రాష్ట్రంలో రాక్షస పాలనకు తెరతీసిన టీడీపీ నేతలు