ఆన్‌లైన్‌లోనూ పీజీఆర్‌ఎస్‌ అర్జీలు నమోదుకు అవకాశం | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లోనూ పీజీఆర్‌ఎస్‌ అర్జీలు నమోదుకు అవకాశం

Jun 23 2025 5:48 AM | Updated on Jun 23 2025 5:48 AM

ఆన్‌లైన్‌లోనూ పీజీఆర్‌ఎస్‌ అర్జీలు నమోదుకు అవకాశం

ఆన్‌లైన్‌లోనూ పీజీఆర్‌ఎస్‌ అర్జీలు నమోదుకు అవకాశం

గుంటూరు వెస్ట్‌: ఆన్‌లైన్‌లోనూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) అర్జీలను Meekosam.ap.gov.in లోనూ నమోదు చేసుకోవచ్చని చీఫ్‌ గ్రీవెన్స్‌ అధికారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీ స్టేటస్‌ను 1100 నంబర్‌కు నేరుగా ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. సోమవారం యథావిధిగా పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలియజేశారు.

‘ఆర్‌టీఈ’ కింద రెండవ

విడతలో 73 మంది ఎంపిక

నరసరావుపేట ఈస్ట్‌: విద్యాహక్కు చట్టం కింద పల్నాడు జిల్లా పరిధిలో రెండవ విడత లాటరీలో 73 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలకు ఎంపికై నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్‌.చంద్రకళ, సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ వి.సుబ్బారావు ఆదివారం తెలిపారు. ఎంపికై న విద్యార్థుల జాబితా మండల కార్యాలయాలలో అందుబాటులో ఉంచటంతోపాటు తల్లిదండ్రుల మొబైల్‌ ఫోన్‌లకు సమాచారం పంపినట్టు వివరించారు. తల్లిదండ్రులు పూర్తి ఆధారాలతో ఈ నెల 28వ తేదీలోపు ఆయా పాఠశాలల్లో సంప్రదించాలన్నారు. తమ పిల్లల ఒకటో తరగతి ప్రవేశాలను నిర్ధారించుకోవాలని సూచించారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఎంపికై న విద్యార్థుల ప్రవేశాలను తిరస్కరించరాదని స్పష్టం చేశారు. మండల విద్యాశాఖాధికారులు విద్యార్థుల ప్రవేశాలను నిర్ధారించుకొని సదరు జాబితాను ఈ నెల 28వ తేదీన డీఈఓ కార్యాలయంలో అందచేయాలని తెలిపారు.

ఆలయ నిర్మాణానికి రూ.3,00,116 విరాళం

నరసరావుపేట రూరల్‌: ఇస్సపాలెం మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణానికి గ్రామానికి చెందిన జల్లి శ్రీనివాసరావు, చౌడేశ్వరి దంపతులు రూ.3,00,116 విరాళంగా అందజేశారు. ఆలయ కార్యాలయంలో ఆదివారం ఈవో నలబోతు మాధవిదేవిని కలిసిన దాతలు విరాళం మొత్తాన్ని అందజేశారు. కార్యక్రమంలో దాతల కూమారుడు నరేంద్రకుమార్‌ సతీమణి శ్రీదేవి, రెండవ కుమారుడు నాగవేణు హరికుమార్‌, ఆలయ అర్చకులు కొత్తలంక కార్తికేయ శర్మ, నండూరి కాళికృష్ణలు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి దాతలు విరాళాలు అందజేసి సహకరించాలని ఈవో కోరారు.

జూలై 4న జెడ్పీ సర్వసభ్య సమావేశం

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశాన్ని జూలై 4న ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మార్చి 29న సభ్యుల గైర్హాజరుతో నిరవధికంగా వాయిదా పడిన సర్వసభ్య సమావేశాన్ని తిరిగి జూలై 4న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు జెడ్పీటీసీలతో పాటు ప్రజాప్రతినిధులు, మూడు జిల్లాల్లోని ప్రభుత్వ శాఖల అధికారులకు నోటీసులు పంపారు.

జగన్మాతకు జేజేలు

దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ

ఆర్జిత సేవల్లో ఉభయదాతలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భక్తజనం జగన్మాతకు జేజేలు పలికారు. నగరంలోని దుర్గగుడిలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం ఆరు గంటల నుంచే ప్రారంభమైన భక్తుల రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది. సర్వ దర్శనంతో పాటు రూ. 100,రూ. 300, రూ. 500 టికెట్ల క్యూలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం కావడంతో అమ్మవారి ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. లోక కల్యాణార్థం ఆదివారం ఆలయ ప్రాంగణంలో సూర్యోపాసన సేవ నిర్వహించారు. ఉభయదాతలను ప్రత్యేక క్యూలైన్‌ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఉదయం 11 గంటలకు అన్ని క్యూలైన్లు కిటకిటలాడటంతో అంతరాలయ దర్శనం నిలిపివేశారు. రూ. 300 టికెట్‌పై బంగారు వాకిలి దర్శనం కల్పించగా, రూ. 100 టికెట్‌పై రెండు క్యూలైన్లు నడిచాయి. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ అనంతరం పల్లకీ సేవ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement