
నగరపాలక సంస్థ ‘వీధి’ దోపిడీ
నెహ్రూనగర్: గుంటూరు నగరంలో స్ట్రీట్ వెండింగ్ పాలసీపై ఒక కొలిక్కి రాకుండానే వీధి వ్యాపారుల నుంచి నగరపాలక సంస్థ రూ.150 వసూలు చేస్తోంది. నగరంలోని 207 వార్డు సచివాలయాల పరిధిలోని సెక్రటరీలు వీధి వ్యాపారుల వద్దకు వెళ్లి చలానాలు కట్టాలని సూచిస్తున్నారు. ఇదేం దోపిడీ అంటూ వీధి వ్యాపారులు గత్యంతరం లేక నగరపాలక సంస్థ కార్యాలయంలో నగదు చెల్లిస్తున్నారు.
30వేలకు పైగా వీధి వ్యాపారులు
నగరంలో సుమారు 30వేలకు పైగా వీధి వ్యాపారులున్నారు. గతంలో ఇచ్చిన గుర్తింపు కార్డులను కొంత మంది దుర్వినియోగం చేశారనే కారణంతో ప్రస్తుత కమిషనర్ పులి శ్రీనివాసులు వాటిని రద్దు చేశారు. తిరిగి కొత్తగా ఐడీ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించారు. వ్యాపారాలను చెక్ చేసిన తరువాత ఐడీ కార్డులు ఇస్తామని గత సంవత్సరం నవంబర్లో నగరపాలక సంస్థ అధికారులు చెప్పారు. దీంతో పలువురు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఇంత వరకూ కార్డులు ఇవ్వకపోగా, సచివాలయం వారీగా సెక్రటరీలు రూ.150 చలానా కట్టిస్తున్నారు.
స్ట్రీట్ వెండింగ్ పాలసీపై స్పష్టత కరువు
నగరపాలక సంస్థ పరిధిలో మూడు జోన్లను పట్టణ ప్రణాళిక అధికారులు ఏర్పాటు చేశారు. రెడ్జోన్ మినహా గ్రీన్ జోన్, అంబర్ జోన్ పరిధిలో వ్యాపారం చేసుకునే వారికి గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు గత ప్రభుత్వ హయాంలోనే కార్యాచరణ సిద్ధం చేశారు. అయితే, 2022లో స్ట్రీట్ వెండింగ్ పాలసీపై కొంత మంది కోర్టును ఆశ్రయించారు. ఆశీలు వసూలు చేయకూడదని స్పష్టం చేయడంతో నగరపాలక సంస్థ నిలిపివేసింది. దీంతో గత రెండు, మూడు సంవత్సరాలుగా నగరపాలక సంస్థ టెండర్ నిర్వహించకపోవడంతో రూ.3 కోట్లు దాకా కార్పొరేషన్ ఆదాయానికి నష్టం వాటిల్లుతోంది. స్ట్రీట్ వెండింగ్ పాలసీ అమలయ్యే వరకు ఆశీలు వసూలు చేసే కార్యక్రమంపై నగరపాలక సంస్థ దృష్టి సారిస్తే కార్పొరేషన్కు కోట్ల రూపాయిల ఆదాయం సమకూరేది. అటు ఈ విషయంపై దృష్టి సారించక..ఇటు స్ట్రీట్ వెండింగ్ పాలసీపై స్పష్టత ఇవ్వకుండా రూ.150 వసూలు చేయడం ఎంత వరకు సమంజసమని వీధి వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు.
అక్రమ ఆక్రమణల దళం దౌర్జన్యం
నగరంలో పలు ప్రాంతాల్లో అక్రమ ఆక్రమణ దళ సిబ్బంది దౌర్జన్యం చేసి, వ్యాపారాలు జరగనివ్వకుండా చేస్తున్నారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. మామూళ్లు ఇచ్చుకుంటే జోలికి పోవడం లేదని.. ఇవ్వకపోతే కాటాలు, ఇతర వస్తువులు తీసుకువెళుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి స్ట్రీట్ వెండింగ్ పాలసీపై స్పష్టత ఇచ్చి, న్యాయం చేయాలని పలువురు వ్యాపారస్తులు కోరుతున్నారు.
ఐడీ కార్డ్ పేరిట వీధి వ్యాపారుల
నుంచి రూ.150 వసూలు
ఇదేం దోపిడీ అంటూ
వ్యాపారుల మండిపాటు