
నిబంధనలకు పాతెర
పట్నంబజారు: కార్లు, ఇతర వాహనాల అద్దాలకు నల్ల ఫిల్మ్ వాడకాన్ని సుప్రీం కోర్టు పూర్తి నిషేధించింది. ఒక వేళ వాడినా 30 నుంచి 60శాతంలోపు మాత్రమే వినియోగించాలి. మోటార్ వెహికల్ యాక్ట్ 1989/100 ప్రకారం, సీఆర్పీసీ 188 ప్రకారం నలుపు రంగు ఫిల్మ్ వాడకూడదనే స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. దీంతో పాటు 20 ఏళ్ల కిందటే సుప్రీం కోర్టు కూడా దీనిపై నిషేధాజ్ఞలు జారీ చేసింది. గతంలో అనేక ఘటనలు, కిడ్నాప్లు, అసాంఘిక కార్యకలాపాలు జరిగిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ ఆదేశాలను వెలువరించింది. బ్లాక్ ఫిల్మ్ వినియోగిస్తే చర్యలు తీసుకోవాలని రవాణా, పోలీసు శాఖలకు బాధ్యతలు అప్పగించింది. అయితే, రెండు శాఖల అధికారులు పట్టించుకోకపోవడంతో ఇటీవల వాహనాలకు విచ్చలవిడిగా వాడుతున్నారు.
కార్లకు విచ్చలవిడిగా వినియోగం
గుంటూరు నగర పరిఽధిలో సుమారుగా 30వేలకు పైగా కార్లు ఉంటాయని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సొంత కార్లతో పాటు ట్రావెల్స్, మ్యాక్సీ క్యాబ్లు కలిపి రెండు వేలకుపైగా ఉంటాయి. వీటిలో కార్ ట్రావెల్స్ నిర్వాహకులు, సొంత కార్లు ఉన్నవారు బ్లాక్ ఫిల్మ్ను అధికంగా వినియోగిస్తున్నారు. బ్లాక్ ఫిల్మ్ వినియోగిస్తే తొలిసారి రూ 300 జరిమానా, తరువాత రూ. 500 వేస్తారు. మూడోసారి కూడా ఇదే విధంగా వ్యవహరిస్తే, కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచే అవకాశాలున్నాయి.
జెడ్ ప్లస్కు మాత్రమే అనుమతి
భద్రత ప్రమాణాల్లో భాగంగా జెడ్ప్లస్ కేటగిరీ ఉన్న వారికి మాత్రమే బ్లాక్ ఫిల్మ్ వినియోగించాలని సుప్రీం కోర్టు పేర్కొంది. ఆఖరికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు సైతం బ్లాక్ ఫిల్మ్ లేని వాహనాలనే వినియోగించాలని స్పష్టంగా చెప్పింది. బ్లాక్ ఫిల్మ్ వినియోగించదలచిన వారు రాష్ట్ర హోం సెక్రటరీ అధ్వర్యంలో డీజీపీతో పాటు ఇతర ప్రముఖ అధికారులతో కూడిన కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి. భద్రత ప్రమాణాల దృష్ట్యా మినహాయింపు పొందే అవకాశం ఉంది. ఇది కూడా వారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వాహనాల వెనుక వైపు అద్దాలకు 70శాతం, సైడ్ గా్లాసెస్కు 30 నుంచి 50 శాతం మాత్రమే బ్లాక్ ఫిల్మ్ ఉండాలి. కానీ ఈ నిబంధనలను స్టిక్కరింగ్ పాయింట్లు, ప్రముఖ షోరూమ్ల నిర్వాహకులు పట్టించుకోకపోవడం లేదు. కార్లకు వాహనాలకు 100శాతం బ్లాక్ ఫిల్మ్ను వినియోగిస్తూ యథేచ్ఛగా తిరుగుతున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఫిల్మ్తోపాటు గ్లాసెస్ కూడా నిర్ణీత పరిమాణాలను మించి ఉండకూడదు. వాహనాల్లోని లోపలి భాగాలు స్పష్టంగా కనిపించాలి.
కనీస తనిఖీలు ఏవీ ?
కారుల అద్దాలకు విచ్చల
విడిగా నల్ల ఫిల్మ్ వాడకం
సుప్రీం కోర్టు ఆదేశాలు బేఖాతరు
పట్టించుకోని రవాణా శాఖ,
ట్రాఫిక్ అధికారులు
గుంటూరు నగరంలో రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ), ట్రాఫిక్ పోలీసులు కనీస తనిఖీలు కూడా చేపట్టడం లేదు. ఏదైనా ఘటన జరిగితే తప్పా చర్యలు తీసుకొనే పరిస్థితి లేదు. నిబంధనల ప్రకారం అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తనిఖీలు నిర్వహించి, బ్లాక్ ఫిల్మ్ వినియోగంపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.