
బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలి
సచివాలయ ఉద్యోగుల వినతి
నెహ్రూనగర్: బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీఓ నం.5ను సవరించాలని సచివాలయ ఉద్యోగులు విన్నవించారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యాలయంలో అదనపు కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పారదర్శకంగా బదిలీలు జరపాలని కోరారు. సొంత మండలాల నిబంధనను తీసివేయాలని, అంతర్ జిల్లాల బదిలీలకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సొంత మండలాల ప్రాతిపదికగా కాకుండా అర్బన్ లోకల్ బాడీ(యుఎల్బీ)లోని వార్డును తీసుకోవాలని, గ్రామాల్లో పంచాయతీని ప్రాతిపదికగా తీసుకోవాలని కోరారు. ప్రమోషన్తో పాటు స్పష్టమైన సర్వీస్ రూల్స్ను రూపొందించిన తర్వాతనే బదిలీలు చేపట్టాలని విన్నవించారు. మిగులు ఉద్యోగులను సీనియారిటీ ఆధారంగా వివిధ శాఖల్లోనికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గుంటూరు వార్డు సచివాలయాల అసోసియేషన్ నాయకులు అబ్దుల్ రజాక్, ధనలక్ష్మి, అనురాధ, మధు, రామకృష్ణ, రాజకుమార్ పాల్గొన్నారు.
అండర్–14 టెన్నిస్ విజేత విన్సెంట్
గుంటూరు వెస్ట్ (క్రీడలు): గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్, వీవీవీ హెల్త్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జేకేసీ కళాశాల రోడ్డులో సోమవారం జరిగిన అండర్–14 టెన్నిస్ పోటీల్లో మిక్స్డ్ సింగిల్స్ విజేతగా కె. విన్సెంట్, రన్నర్గా జి.దిశాంత్ నిలిచారు. డబుల్స్ విభాగంలో దిశ, విన్సెంట్ జోడీ విన్నర్గానూ జి.దిశాంత్, కల్యాణీలు రన్నర్స్గా నిలిచారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో విజేతలకు ఆపిల్ డెంటల్ కేర్ అధినేత డాక్టర్ హనుమంతరావు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వీవీవీ హెల్త్ క్లబ్ డెరెక్టర్ హరికృష్ణ, మధుస్మిత, గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్, ఆనంద్ కుమార్, అరుణ్ కుమార్, చరణ్ పాల్గొన్నారు.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ అధ్యక్షుడిగా బుజ్జిబాబు
గుంటూరు ఎడ్యుకేషన్ : న్యూజిలాండ్లో అవర్ స్టేట్ అవర్ లీడర్ ఇంటిలెక్చ్యువల్ ఫోరం కో–ఆర్డినేటర్, వైఎస్సార్ సీపీ కన్వీనర్గా వ్యవహరిస్తున్న నెల్లూరి బుజ్జిబాబు ఆంధ్ర తెలుగు అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ అధ్యక్షుడిగా ఎన్నికై నట్లు గుంటూరుకు చెందిన ఫోరం అధ్యక్షుడు జి.శాంతమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైఎస్సార్ సీపీ కన్వీనర్గా న్యూజిలాండ్లోని తెలుగువారిని సమన్వయపర్చడంతో పాటు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. తెలుగు అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నికై న సందర్భంగా బుజ్జిబాబుకు అభినందనలు తెలియజేశారు.
‘ఫలక్నుమా’లో ఆరుగురు
బాల కార్మికులు గుర్తింపు
రాజుపాలెం: నడికూడి రైల్వే పోలీసు, గుంటూరు ఆర్పీఎఫ్, బచపన్ బచావో ఆందోళన్ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో గుంటూరు నుంచి పిడుగురాళ్ల వరకు ట్రైన్లో రిస్క్ ఆపరేషన్ నిర్వహించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఆరుగురు బాలురను గుర్తించి వారి వివరాలను సేకరించారు. వీరిని ఇతర ప్రాంతాలకు బాల కార్మికులుగా పనిచేయించేందుకు తీసుకెళుతున్నట్లు తెలిసింది. వారివారి గ్రామాలకు పంపించే వరకు మండలంలోని కొండమోడు పరిధిలో గల వీరమ్మ కాలనీలోని అనాఽథ పిల్లల ఆశ్రమం నిర్వాహకులు గరికపాటి శంకరరావుకు ఆదివారం రాత్రి స్థానిక ఎస్ఐ వేణుగోపాల్ సహకారంతో అప్పగించారు. ఈ బాలురు జార్ఖండ్, బిహార్, వెస్ట్ బెంగాల్కు చెందిన వారిగా గుర్తించారు. తల్లిదండ్రులకు అప్పగించే వారకు జాగ్రత్తగా చూసుకోవాలని ఆశ్రమ నిర్వాహకులకు సూచించారు.
యువకుడి బలవన్మరణం
చిలకలూరిపేట టౌన్: పట్టణంలోని టిడ్కో గృహాల్లో విషాదం చోటు చేసుకుంది. 52 ఎకరాల టిడ్కో గృహాల్లో నివసిస్తున్న యువకుడు దేవగిరి తేజారెడ్డి (28) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫ్యానుకు లుంగీతో ఉరివేసుకుని తన స్నేహితుడి నివాసంలో జీవితం ముగించుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తేజారెడ్డి పర్చూరు మండలం అన్నవరం గ్రామానికి చెందినవాడు. చిన్నతనంలోనే తల్లి మృతిచెందగా, తండ్రి రెండో వివాహం చేసుకుని వేరుగా నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తేజారెడ్డిని నాయనమ్మ పెంచింది. అయితే కొంతకాలం కిందట ఆమె మృతిచెందడంతో అతను పూర్తిగా ఒంటరివాడయ్యాడు. పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగించిన తేజారెడ్డి మానసికంగా ఒత్తిడికి గురైనప్పుడల్లా టిడ్కో గృహంలో ఉన్న తన స్నేహితుడి వద్దకు వచ్చి ఒకటి రెండు రోజులు ఉండి వెళ్లిపోతాడు. ఆదివారం స్నేహితుడి ఇంటికి రావడంతో సాయంత్రం 4 గంటలకు మిత్రుడు పనిమీద బయటకు వెళ్లాడు. రాత్రి తిరిగి వచ్చి గది తలుపులు తీయగా తేజారెడ్డి ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు, గుంటూరు మండలం అంకిరెడ్డిపాలెంలో ఉంటున్న అమ్మమ్మకు సమాచారం అందించడంతో ఆమె పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలి

బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలి

బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలి