
సమస్యలకు చట్ట పరిధిలో పరిష్కారం
నగరంపాలెం: స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ)లో ప్రజా ఫిర్యాదులు – పరిష్కారాల వ్యవస్థ (పీజీఆర్ఎస్) ను సోమవారం నిర్వహించారు. బాధితుల నుంచి జిల్లా ఎస్పీ సతీష్కుమార్ అర్జీలు స్వీకరించారు. వారి బాధలను అలకించారు. ఆయా సమస్యలకు సంబంధించి పోలీస్ అధికారులతో మొబైల్లో మాట్లాడారు. అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంత్, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), ఎ.శివాజీ రాజు (సీసీఎస్) కూడా బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
బెదిరిస్తున్నారు
స్థానికంగా ఇంటి వద్ద ఇద్దరు రౌడీషీటర్లు, వారి కుటుంబ సభ్యులు ఉంటున్నారు. వారిద్దరు ఏకమై, నన్ను ట్రాప్ చేశారు. బలత్కారం మినహా పనులన్నీ చేశారు. దీని ఆసరా చేసుకుని నా వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికి రూ.40 వేలను విడతల వారీగా తీసుకున్నారు. ఆ డబ్బులు కూడా ఇంట్లో నుంచి తీసుకువచ్చి వారికి ఇచ్చా. మరలా ఇవ్వకపోతే చంపుతామని బెదిరిస్తున్నారు. నమ్మకంగా నమ్మించి నగదు కాజేశారు. రౌడీషీటర్ భార్య కూడా నన్ను బెదిరిస్తోంది. ఏదైనా చేస్తారని భయంగా ఉంది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని రక్షణ కల్పించాలని కోరుతున్నా.
– ఓ బాలిక, గుంటూరు
సహచర కానిస్టేబుల్ మోసం
మంగళగిరి సబ్ డివిజన్లోని ట్రాఫిక్ పీఎస్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నా. సహచర కానిస్టేబుల్ కమీషన్ల కోసం ఓ ప్రైవేటు కంపెనీ పాలసీలు చేయించాడు. వాటికి సంబంధించి నగదు చెల్లించ లేదు. ఈలోగా అతడి భార్య ఇల్లు నిర్మాణం కోసం డబ్బులు అడగ్గా, రూ.1.20 లక్షలు ఇచ్చాను. సదరు కానిస్టేబుల్ తర్వాత నా బంగారం కూడా తనఖా పెట్టుకుని డబ్బులు తీసుకున్నాడు. గతంలో ఇచ్చిన డబ్బులు అడిగితే ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. న్యాయం చేయగలరు.
– బి.అంకరాజు, ట్రాఫిక్ కానిస్టేబుల్
జిల్లా ఎస్పీ సతీష్కుమార్