
కాల‘కూటమి’ అబద్ధాల నిలదీత !
పట్నంబజారు: కూటమి సర్కార్ దుర్నీతిని ఎండగట్టేందుకు ‘యువత పోరు’బాట పట్టనుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కూటమి సర్కార్ ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన వాగ్దానాల అమలుపై నిలదీయనున్నారు. 20లక్షల ఉద్యోగాలిస్తామని, లేనిపక్షంలో రూ. 3వేల నిరుద్యోగ భృతినిస్తామని చంద్రబాబు నమ్మబలికారు. తీరా గెలిచిన తరువాత రెడ్బుక్ మార్క్ పాలనతో భయభ్రాంతులకు గురి చేస్తున్న నేపథ్యంలో ధ్వజమెత్తనున్నారు. ఏడాది పాలన గడిచిన నేపథ్యంలో ఒక్కొక్కరికీ రూ. 36వేలు బకాయి పడ్డావు బాబూ... అని దిక్కులు పిక్కట్లిల్లేలా నినదించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ మినహా, కొత్తగా ఏదీ విడుదల చేయలేదు. డీఎస్సీ కూడా అరకొరగా ఇచ్చింది. గ్రూప్ 2, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. పథకాలు అమలు చేయలేని పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ తప్పా చేస్తోంది ఏమీ లేదనే అభిప్రాయాలు యువత నుంచి వ్యక్తమవుతున్నాయి.
యువతకు అండగా వైఎస్సార్ సీపీ
యువత జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘యువత పోరు’కు శ్రీకారం చుట్టింది. నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు ఉదయం 9గంటలకు చేరుకుని, ధర్నా చౌక్ వద్ద శాంతియుత వాతావరణంలో నిరసన తెలుపుతారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేస్తారు. కూటమి మోసాన్ని ఎండగడుతూ స్వచ్ఛందంగా నిరసన తెలియజేసేందుకు యువజనులు పెద్దఎత్తున కార్యక్రమానికి తరలిరానున్నారు. కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగట్టనున్నారు.
నేడు వైఎస్సార్ సీపీ ‘యువత పోరు’
కూటమి నిర్లక్ష్యాన్ని
నిలదీయనున్న యువత
జిల్లా కలెక్టర్ కార్యాలయం
వద్ద నిరసన
యువతను నిలువునా మోసం
కూటమి సర్కార్
రాష్ట్ర ప్రభుత్వ విధానాలను
ఎండగట్టనున్న వైఎస్సార్ సీపీ