ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణే ధ్యేయం

Jun 23 2025 5:48 AM | Updated on Jun 23 2025 5:48 AM

ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణే ధ్యేయం

ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణే ధ్యేయం

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాలని ఏపీటీఎఫ్‌ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కె. బసవ లింగారావు పిలుపునిచ్చారు. జిల్లా కోర్టు ఎదుట ఉన్న సంఘ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యవర్గ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుతున్న కాలంలో ఉపాధ్యాయులు బోధనా పద్ధతులను కూడా మార్చుకుని, తల్లిదండ్రుల అభీష్టం మేరకు వృత్తికి పునరంకితమై పని చేయాలని సూచించారు. తల్లిదండ్రుల మద్దతుతో ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుని, ఉన్నత విద్యాప్రణామాలు నెలకొల్పేందుకు కృషి చేయాలని కోరారు. విద్యారంగానికి నష్టం చేసే సంస్కరణలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులను ఇతర పనుల నుంచి మినహాయించి, కేవలం బోధనకే పరిమితం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులకు అందుబాటులో ఉన్న పాఠశాలల నుంచి తరగతులను విభజించి, ఇతర చోట్లకు తరలించడం విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రతి పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించాలని కోరారు. పాఠశాలల్లో అడ్మిషన్లు జరుగుతున్న సమయంలో శిక్షణ పేరుతో ఉపాధ్యాయులను పాఠశాలకు దూరం చేయడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ఉపాధ్యాయ సంఘాల సూచనలు, అభిప్రాయాలను తీసుకుని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీటీఎఫ్‌ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌ ఖాలీద్‌ మాట్లాడుతూ బదిలీలు, పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు జూన్‌ వేతనాలు పొందడంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. 12వ పీఆర్సీ కమిషన్‌ నియమించి 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 11వ పీఆర్సీ బకాయిలతో పాటు పెండింగ్‌ ఉన్న మూడు కరువు భత్యాలను ప్రకటించి పాత బకాయిలు విడుదల చేయాలని కోరారు. పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ, సరెండర్‌ లీవ్‌ బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఏపీటీఎఫ్‌ జిల్లా కమిటీ సభ్యులు పి.లక్ష్మీనారాయణ, జి.దాస్‌, చక్కా వెంకటేశ్వరరావు, ఎస్‌.ఎస్‌.ఎన్‌. మూర్తి, వి.కిశోర్‌ షా, వివిధ మండల శాఖల బాధ్యులు టి.భాస్కర్‌, జహంగీర్‌, శ్రీనివాసరావు, శివరామకృష్ణ, బాలరాజు, వెంకటేశ్వరావు, కుటుంబరావు, మాలకొండయ్య, మరియరాజు, షూకూర్‌, రమేష్‌ పాల్గొన్నారు.

ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

కె. బసవ లింగారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement