
సమ్మెలోకి అవుట్ సోర్సింగ్ కార్మికులు
నెహ్రూనగర్: రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థల్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్ విభాగ అవుట్ సోర్సింగ్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆదివారం రాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లారు. నగరపాలక సంస్థ కార్యాలయం ముందు సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ ఈదులమూడి మధుబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం కార్మికులు, కార్మిక సంఘాలు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి ఈనెల 9న కమిషనర్కు సమ్మె నోటీస్ ఇచ్చినా స్పందించలేదని విమర్శించారు. కార్మికులకు జీతాలు పెంచమని పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని తెలిపారు. విధి లేని పరిస్థితుల్లో సమ్మె చేస్తున్నట్లు మధుబాబు తెలిపారు. గత ప్రభుత్వం పారిశుద్ధ్యం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులకు, డ్రైవర్లకు అప్పుడున్న జీతంపై రూ.6000 అదనంగా పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ విభాగంలో పనులు చేసే కార్మికులకు కమిటీ వేసి దాని సిఫార్సు మేరకు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిందని తెలిపారు. ఈనెల రెండో తేదీన జరిగిన జాయింట్ మీటింగ్లో ఈ విషయాన్ని మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లగా ముఖ్యమంత్రితో మాట్లాడి చెప్తామని చెప్పి, ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదని వివరించారు. రిటైర్మెంటు వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని, ఉద్యోగ విరమణ చేసిన కార్మికులకు వెంటనే గ్రాట్యుటీ చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులందరినీ హెచ్ఆర్ పాలసీ పరిధిలోకి లేదా మినిమం టైమ్ స్కేల్ ఇవ్వాలని కోరారు. సీనియార్టీ ప్రకారం సంవత్సరానికి ఆరు పర్సెంట్ ఇంక్రిమెంట్ ఇస్తూ జీతాలు చెల్లించాలని లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ గుంటూరు నగరపాలక సంస్థ కమిటీ ప్రధాన కార్యదర్శి రాయపూడి కోటి బాబు, కోశాధికారి నాగిపోగు సుమన్, కార్యనిర్వాహక అధ్యక్షుడు గాలి ఏసుబాబు, సంయుక్త కార్యదర్శి వేపూరి రవిశంకర్ పాల్గొన్నారు.