
డీఏఓగా నరసింహారావు బాధ్యతల స్వీకరణ
కొరిటెపాడు(గుంటూరు): జిల్లా వ్యవసాయ అధికారిగా (డీఏఓ) యు.నరసింహారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యవసాయ అధికారిగా పని చేసిన నున్నా వెంకటేశ్వర్లు నంద్యాల జిల్లాకు బదిలీ అయ్యారు. దీంతో బదిలీపై వచ్చిన నరసింహారావు జిల్లా వ్యవసాయ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సకాలంలో అందించేలా కృషి చేస్తానని తెలిపారు. అయితే, నరసింహారావు ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తర్వాత జిల్లా వ్యవసాయ అధికారిగా కడప జిల్లా డీడీఏగా పనిచేస్తున్న ఎ.నాగేశ్వరరావు బాధ్యతలు తీసుకోనున్నారు.
వృద్ధురాలి నేత్రదానం
ప్రత్తిపాడు: తాను మరణించినా నేత్రా లు మూతపడకూడదని భావించిన ఓ వృద్ధురాలు వాటిని దానం చేశారు. ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడుకు గ్రామానికి చెందిన వృద్ధురాలు మండెపూడి హేమలత (66) నేత్ర దానం చేసి మరణానంతరం మరరొకరికి ఈ లోకాన్ని చూసే అవకాశాన్ని కల్పించారు. హేమలత బుధవారం గొట్టిపాడులోని స్వగృహంలో మధ్యాహ్నం కన్నుమూశారు. ఆమె కోరిక మేరకు నేత్రాలను శంకర కంటి ఆస్పత్రి డాక్టర్ శ్రీనిజ బృందం సేకరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కొల్లిపరలో 45.2 మి.మీ. వర్షం
కొరిటెపాడు(గుంటూరు): జిల్లావ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు అత్యధికంగా కొల్లిపర మండలంలో 45.2 మిల్లీమీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా ఫిరంగిపురం మండలంలో 2.4 మి.మీ. పడింది. సగటున 21.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. కాకుమాను మండలంలో 38.6 మి.మీ., వట్టిచెరుకూరు 37.2, దుగ్గిరాల 36.8, చేబ్రోలు 34, తాడపల్లి 29.6, తుళ్లూరు 28.2, మంగళగిరి 27, పొన్నూరు 24, తెనాలి 18.2, తాడికొండ 14.8, పెదకాకాని 13.6, గుంటూరు తూర్పు 12.2, గుంటూరు పశ్చిమ 11.2, ప్రత్తిపాడు 9.8, పెదనందిపాడు 8.4, మేడికొండూరు మండలంలో 3.2 మి.మీ. చొప్పున వర్షం పడింది.

డీఏఓగా నరసింహారావు బాధ్యతల స్వీకరణ