అయ్యో.. గాంధ్ర! | - | Sakshi
Sakshi News home page

అయ్యో.. గాంధ్ర!

Jun 13 2025 5:27 AM | Updated on Jun 13 2025 5:27 AM

అయ్యో

అయ్యో.. గాంధ్ర!

ప్రత్తిపాడు: యోగాంధ్ర రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సచివాలయ ఉద్యోగులకు తిప్పలు తెచ్చి పెట్టింది. కచ్చితంగా వారి పరిధిలోని హౌస్‌ హోల్డ్స్‌కు రిజిస్ట్రేషన్‌ చెయ్యాల్సిందేనని మండల స్థాయి అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో హౌస్‌ హోల్డ్స్‌ డేటా తీసుకుని, సచివాలయాల్లో కూర్చుని సిబ్బంది రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసేస్తున్నారు. దీంతో మృతిచెందిన వారికి, బతికి ఉన్నవారికి తేడా లేకుండా అందరికీ యోగాంధ్ర రిజిస్ట్రేషన్‌ మెసేజ్‌లు వస్తున్నాయి. ఆధార్‌ కార్డుకు మొబైల్‌ నంబర్‌ లింక్‌ అయ్యి లేని వారికి మాత్రమే ఓటీపీలు వస్తున్నాయి. లింక్‌ అయిన వారికి ఓటీపీలు రాకుండా నేరుగా ప్రాసెస్‌ అవుతుండటంతో, జనం ఇష్టాయిష్టాలు, ఆసక్తిలతో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా ప్రజలకు తెలియకుండానే యోగాంధ్ర రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. ఒక్కో సచివాలయానికి 1500 రిజిస్ట్రేషన్ల చొప్పున టార్గెట్‌లు విధించినట్లు తెలుస్తోంది.

చనిపోయిన వారికి యోగాంధ్ర రిజిస్ట్రేషన్లు

దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారంటూ వారి కుటుంబ సభ్యుల ఫోన్లకు సందేశాలు బిత్తరపోతున్న కుటుంబీకులు ప్రత్తిపాడు అధికారులు, సచివాలయ ఉద్యోగుల నిర్వాకం

విచారిస్తాం..

చనిపోయిన వారి పేర్లుతో యోగాంధ్ర రిజిస్ట్రేషన్లు చేయడం సరికాదు. దీనిపై వెంటనే విచారిస్తాను. చర్యలు తీసుకుంటాను. పక్కాగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసేందుకు వారితో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం.

– కె.శివపార్వతి, ఎంపీడీఓ, ప్రత్తిపాడు

ఆది నుంచి ఇదే తీరు..

యోగాంధ్ర అమలులో అధికారుల్లో చిత్తశుద్ధి లోపించడంతో మండలంలో ఆది నుంచి అభాసుపాలే అవుతుంది. మొక్కుబడి తంతుగా నిర్వహించి చేతులు దులిపేసుకుంటున్నారు.

నాలుగు రోజుల కిందట ర్యాలీ పేరుతో ఫొటోలకు స్టిల్స్‌ ఇచ్చి, ర్యాలీ చేయకుండానే చేసినట్లుగా షో చేశారు.

అధికారుల షో పై పత్రికల్లో కథనాలు రావడంతో మర్నాడు మరోమారు ఫొటో షూట్‌ ఏర్పాటు చేశారు.

పక్కనే సచివాలయంలో కుట్టు శిక్షణ నేర్చుకునేందుకు వచ్చిన మహిళలను పిలిపించి, వారిని మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట నిలబెట్టి, లోపల నుంచి ఫ్లెక్సీ తెప్పించి మూడు నిమిషాల్లో మూడు యోగాసనాలు మూకుమ్మడిగా వేస్తున్నట్లు స్టిల్స్‌ ఇచ్చి, ఫొటోలు దిగి ఫొటోషూట్‌ ను క్లోజ్‌ చేశారు.

క్రమశిక్షణ పేరుతో తొలిరోజు యోగాపై నిర్వహించిన శిక్షణకు ఆలస్యంగా హాజరైన సచివాలయం సిబ్బందిని బయటే నిలబెట్టి పనిష్మెంట్‌ ఇవ్వడం అప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఆ హడావిడి కూడా ఒకటి రెండు రోజులకే పరిమితం అయ్యింది.

ప్రత్తిపాడు రామానగర్‌ కాలనీకి చెందిన గొరిజవోలు సామ్రాజ్యం 2023 ఆగస్టు 18న చనిపోయారు. కానీ ఆమె ఈ నెల 7వ తేదీన యోగాంధ్రకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు, యోగాసనాలకు వచ్చినప్పుడు అధికారులకు ఈ క్యూఆర్‌ కోడ్‌ చూపించమని ఆధార్‌ నంబర్‌ లింక్‌ అయ్యి ఉన్న కుటుంబ సభ్యుల మొబైల్‌ నంబర్‌కు సందేశం వచ్చింది. దీంతో బిత్తరపోయిన ఆమె కుమారుడు వారి బంధువులు, తెలిసిన వారికి చూపిస్తూ మా అమ్మ యోగాకు వస్తుందంట.. అంటూ వ్యంగ్యాస్త్రాలతో అధికారుల నిర్వాకాన్ని ఎండగడుతున్నాడు.

ప్రత్తిపాడుకు చెందిన ఎన్‌.రమాదేవి 2022లో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈమె కూడా ఈ నెల 11వ తేదీన యోగాంధ్రలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు కుమారుని మొబైల్‌కు మెసేజ్‌ వచ్చింది. ‘మీరు యోగాంధ్ర– 2025 కార్యక్రమంలో పాల్గొనాలన్న మీ ఆసక్తికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం’ అంటూ క్యూర్‌ కోడ్‌, ఐడీ నంబరుతో వచ్చిన సందేశం చూసి ఆమె కుమారుడు షాక్‌కు గురయ్యాడు.

అయ్యో.. గాంధ్ర!1
1/1

అయ్యో.. గాంధ్ర!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement