
పారిశుద్ధ్య నిర్వహణపై ఎమ్మెల్యే గల్లా మాధవి సీరియస్
నెహ్రూనగర్: గుంటూరు నగరంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, వర్కర్లను పెంచినప్పటికీ మెరుగుపడటం లేదని పశ్చిమ గల్లా మాధవి నగర కమిషనర్ పులి శ్రీనివాసులపై ఫైర్ అయ్యారు. పనిచేసే వారు తక్కువ, సూపర్వైజ్ చేసే వారు ఎక్కువగా ఉంటే ఏ విధంగా మెరుగుపడుతుందని మండిపడ్డారు. జిల్లాలో జరగుతున్న వివిధ అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో కొన్ని వార్డుల్లో స్పెషల్ శానిటేషన్ అని పెట్టి పనులు చేసినప్పటికీ 25శాతం కూడా ఆశించిన స్థాయిలో పారిశుద్ధ్యం మెరుగుపడలేదని తెలిపారు. వార్డుల్లో ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితి లేదని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య మెరుగుదలకు పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పారు.