తడ‘బడి’న చదువులు | - | Sakshi
Sakshi News home page

తడ‘బడి’న చదువులు

Jun 12 2025 3:47 AM | Updated on Jun 12 2025 3:49 AM

గుంటూరు ఎడ్యుకేషన్‌: వేసవి సెలవుల అనంతరం జిల్లాలోని పాఠశాలలు గురువారం పునఃప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ విద్యార్థులకు మాజీ సీఎం వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం వరుసగా నాలుగేళ్లపాటు విద్యాకానుక కిట్లను పాఠశాల తెరిచిన రోజునే పక్కాగా పంపిణీ చేసింది. నాడు–నేడు ద్వారా సకల వసతులతో ఆధునికీకరించింది.

పాఠశాలలు విద్యార్థులకు సకల వసతులతో స్వాగతం పలికాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏడాదిగా ప్రభుత్వ పాఠశాలలు కళతప్పాయి. గురువారం నిలిచిపోయిన తరగతి గదులు, మూలనపడిన ఆర్వో ప్లాంట్లు విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 1,730 పాఠశాలలకు మూడు లక్షల మంది విద్యార్థులు వెళ్లనున్నారు. ఇందులో 1,074 ప్రభుత్వ పాఠశాలల పరిధిలో 93,464 మంది విద్యార్థులున్నారు. 656 ప్రైవేటు పాఠశాలల పరిధిలో మరో 2,60,354 మంది విద్యార్థులు ఉన్నారు.

ఆరు మండలాలకే పరిమితమైన

యూనిఫాం పంపిణీ

జిల్లాలోని 18 మండలాల పరిధిలో 1,074 పాఠశాలల వారీగా 93,464 మంది విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేయాల్సి ఉంది. కిట్‌లో భాగంగా అందించే పాఠ్య పుస్తకాలు, నోటు బుక్స్‌, వర్క్‌బుక్స్‌, బ్యాగులు, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలు, పిక్టోరియల్‌ డిక్షనరీలు మండల స్టాక్‌ పాయింట్లకు చేర్చినట్లు సమగ్రశిక్ష అధికారులు చెబుతున్నారు. అయితే, యూనిఫాం బుధవారం సాయంత్రానికి కేవలం ఆరు మండలాలకే సరఫరా అయ్యింది. కిట్ల పంపిణీపై ఇప్పటి వరకూ స్పష్టత లేదు.

జగన్‌ పాలనకు ముందు అంతా అధోగతి

2019లో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకు కేవలం పాఠ్య పుస్తకాలు, యూనిఫాం పంపిణీకే పరిమితమైంది. సీఎం వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో రూపుదిద్దుకున్న విద్యాకానుక స్టూడెంట్‌ కిట్లను పేద, మధ్య తరగతి విద్యార్థులకు 10 రకాల సామగ్రితో ఉచితంగా పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వరుసగా నాలుగేళ్లపాటు నిరాటంకంగా విద్యార్థులకు అందజేసింది.

నాడు–నేడు రెండో దశ పనులపై నిర్లక్ష్య వైఖరి

2014–19 మధ్య టీడీపీ పాలనలో శిథిలావస్థకు చేరి, సమస్యలతో కునారిల్లిన ప్రభుత్వ పాఠశాలలకు వైఎస్సార్‌ సీపీ సర్కారు ప్రాణం పోసింది. నాడు–నేడు ద్వారా సకల వసతులతో ఆధునికీకరించింది. నాడు–నేడు మొదటి దశలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 1,183 పాఠశాలలను రూ.283 కోట్లతో కార్పొరేట్‌కు దీటుగా ముస్తాబు చేసింది. నాడు–నేడు రెండో దశలో ఒక్క గుంటూరుజిల్లాలోనే 563 పాఠశాలలను రూ.202 కోట్లతో 10 కాంపొనెంట్ల వారీగా పనులు చేపట్టింది. ప్రభుత్వం దిగిపోయే నాటికి దాదాపు 80 శాతానికి పైగా పూర్తయ్యాయి. వీటిలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా చేపట్టిన 600 తరగతి గదుల నిర్మాణాలు సైతం ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే నాడు–నేడు పనులను అటకెక్కించింది. ఒక్కో పాఠశాలకు కేవలం రూ.ఐదు లక్షలు ఖర్చు పెడితే పూర్తయ్యే అవకాశమున్నచోట సైతం నిర్లక్ష్య వైఖరితో పనుల నిలిచిపోయాయి. అదనపు తరగతి గదులకు సిమెంట్‌, ఇసుక సరఫరా చేయకపోవడంతో సివిల్‌ పనులు మధ్యలోనే అగిపోయాయి. నాడు–నేడు మొదటి దశలో విద్యార్థులకు సురక్షితమైన తాగునీటి సరఫరా కోసం పంపిణీ చేసిన ఆర్వో వాటర్‌ ప్లాంట్లను సైతం పక్కన పడేశారు. రెండో దశలో ఎంపిక చేసిన పాఠశాలలకు ఆర్వో వాటర్‌ ప్లాంట్లు సరఫరా చేసినప్పటికీ వాటిని ఇన్‌స్టాలేషన్‌ చేయకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత విద్యకు ఇచ్చిన భరోసా ఏడాది కూటమి పాలనలో కరువైంది.

నేటి నుంచి పాఠశాలలు

పునఃప్రారంభం

పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీలు

అసంపూర్తిగా తరగతి గదులు,

టాయిలెట్ల నిర్మాణం

పూర్తిస్థాయిలో రాని స్టూడెంట్స్‌ కిట్లు

ఆరు మండలాలకే పరిమితమైన

యూనిఫాం పంపిణీ

పెద్దసంఖ్యలో మూలనపడిన

ఆర్వో ప్లాంట్లు

నాడు–నేడు రెండో దశ పనులు పూర్తి

చేయని కూటమి ప్రభుత్వం

విద్యార్థులకు సమస్యలతో

స్వాగతం పలకనున్న బడులు

గుంటూరు జిల్లాలో బడిబాట పట్టనున్న

మూడు లక్షల మంది విద్యార్థులు

ప్రభుత్వ బడుల్లో 93,464 మందికి

అందాల్సిన కిట్లు

తడ‘బడి’న చదువులు 1
1/3

తడ‘బడి’న చదువులు

తడ‘బడి’న చదువులు 2
2/3

తడ‘బడి’న చదువులు

తడ‘బడి’న చదువులు 3
3/3

తడ‘బడి’న చదువులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement