
‘శారద’ వంటి చరితార్థులే యువతకు ఆదర్శం
తెనాలి: ఒకవైపు పేదరికం...మరోవైపు మూర్ఛవ్యాధితో బాధపడుతూ దుర్భరమైన హోటల్ పనిలో గడుపుతూనే తెలుగు నేర్చుకుని ’శారద’ అనే కలంపేరుతో దశాబ్దాల పాటు మనగలిగిన సాహిత్యాన్ని సృజించిన ఎస్.నటరాజన్ వంటి చరితార్థులను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుగ్రహీత పాపినేని శివశంకర్ సూచించారు. ఆలూరి భుజంగరావు 1985 నాటి రచన ‘సాహిత్య బాటసారి శారద..స్మృతి శకలాలు’ పుస్తకాన్ని శారద శతజయంతి సందర్భంగా ‘తెనాలి ఇంప్రెషన్స్’ ప్రచురించింది. ‘అరసం’, గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో బుధవారం ఏర్పాటైన సభకు వివేక విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అరసం జాతీ య అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. తమిళనాడులోని పుదుక్కోటైలో జన్మించిన నటరాజన్, 12 ఏళ్ల వయసులో తెనాలి వచ్చి, హోటల్ కార్మికుడిగా చేస్తూ సాహితీ దిగ్గజంగా ఎదగడం అపూర్వమన్నారు. ప్రజాసాహితి సంపాదకుడు కొత్తపల్లి రవి బాబు భాష, సాహిత్యంతోనే మనిషి ఉన్నతంగా ఎదుగుతారని చెప్పారు. తెలుగుభాషను, సాహిత్యాన్ని చదవాలని ‘అరసం’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ సూచించారు. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని రామ్చంద్ మాట్లాడుతూ డిగ్రీ విద్యార్థులకు ‘శారద’ పరిచయం మంచి విషయమన్నారు. అరసం జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు స్వాగతం పలికిన సభలో ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, ఉమా రాజశేఖర్తోపాటు ‘శారద’ కుమారులు సుబ్రహ్మణ్యం, రాధాకృష్ణమూర్తి, కుమార్తె శారద, ఆలూరి భుజంగరావు కుమార్తె ఉషారాణి పాల్గొని ప్రసంగించటం విశేషం. కార్యక్రమంలో ముత్తేవి రవీంద్రనాథ్, మొవ్వా సత్యనారాయణ, డాక్టర్ కె.రామరాజు, యడ్లపల్లి వెంకటేశ్వరరావు, లలితానందప్రసాద్, ‘కళారత్న’ కాటూరి వెంకటేశ్వరరావు, జుగాష్ విలి, సజ్జా వెంకటేశ్వర్లు, ఎం.రామలింగేశ్వరరావు, కొండముది రమేష్బాబు పాల్గొన్నారు.
‘సాహిత్య బాటసారి శారద’ పుస్తకావిష్కరణలో ప్రముఖ రచయిత శివశంకర్
హాజరైన శారద, ఆలూరి భుజంగరావు కుటుంబ సభ్యులు